సిద్దిపేట, జూలై 23: గడి మైసమ్మా.. అందరినీ చల్లగా చూడు తల్లి.. అంటూ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అమ్మవారికి మొక్కుకున్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా బోనాల పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఆదివారం పట్టణంలో లాల్గడి మైసమ్మ బోనాలు కనుల పండువగా సాగాయి. ఇందులో పాల్గొన్న మంత్రి హరీశ్రావు ప్రత్యేక పూజలు చేశారు. వైశ్యుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున బోనాల పండుగ జరిగింది. వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలతో వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ బ్రహ్మం, నిర్వాహకులు శ్రీను, స్వప్న, మంకాల నవీన్, శివ పాల్గొన్నారు.