సిద్దిపేట, మే 17 : రజకులు మురుగు నీళ్లతో బట్టలు ఉతికే విధానానికి తెరదించినం… ఆధునిక టెక్నాలజీ సహాయంతో రజకులు షిప్టుల వారీగా పని కల్పించి ఉపాధి మార్గాలను పెంచి ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక,వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ఎర్రచెరువు వద్ద గల ఆధునిక దోబీఘాట్లో రూ.1.10కోట్లతో మోడ్రన్ శారీ రోలింగ్, బెడ్షీట్ రోలింగ్ మిషన్లు, టాటాఏస్ వాహనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సిద్దిపేట మోడ్రన్ దోబీఘాట్ రాష్ర్టానికే ఆదర్శమని, నాలుగేండ్ల కింద రాష్ట్రంలోనే మొదటి సారిగా దోబీఘాట్ను నిర్మించుకున్నామన్నారు. అప్పటి నుంచి రజకులు చెరువుల్లో బట్టలు ఉతకకుండా మిషన్ల ద్వారా ఉతికే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన బట్టలు ఉతికి అందించే అవకాశం కల్పించామన్నారు.
గతంలో కోమటిచెరువు వద్ద బట్టలు సంప్రదాయ పద్ధతుల్లో ఉతికినప్పుడు సోడా వాడకంతో రజకుల చేతులు, కాళ్లుదెబ్బతిని ఆరోగ్యం పాడైన సందర్భాలు చూశామన్నారు. చెరువులో నీరు కలుషితమై వివిధ రకాల ఇబ్బందులు ఉండేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజక వృత్తికి నూతన సొబగులు వచ్చాయన్నారు. మహిళలు తమ చీరెలు శుభ్రపరిచేలా శారీ రోలింగ్ మిషన్ కావాలని, అవిలేక గిరాకీ కావడం లేదనడంతో వారి కోరిక మేరకు మోడ్రన్ శారీ రోలింగ్, బెడ్షీట్ మిషన్లు మంజారు చేయించినట్లు చెప్పారు. వివిధ వ్యాపార సంస్థలు, హోటళ్లు, దవాఖానల నుంచి బట్టలు తీసుకురావడం,తిరిగి ఇచ్చేందుకు ఇబ్బందులు లేకుండా రూ.6లక్షలతో టాటాఏస్ వాహనాన్ని మంజారు చేసి సకాలంలో అందుబాటులో ఉంచామన్నారు.ఈ నూతన మిషన్ల వల్ల రజకులకు మరింత గిరాకీ పెరగాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే ప్రతి నెలా రజకులకు లక్షా10 వేల నుంచి లక్షా20 వేల వరకు ఉపాధి లభిస్తున్నదన్నారు. రజక వృత్తిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ సరోజ, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరామ్, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలతాశ్రీహరి,సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.