చేర్యాల, మార్చి 15 : అదనపు కట్నం కోసం అత్తింటి వేదింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాస్కర్రెడ్డి, మృతురాలి బందువుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బొల్లికొండ కృష్ణమూర్తి కుమార్తె వీణ(34)ని 2009లో పులిగిళ్ల మడలం నడికూడకి చెందిన పాలకుర్తి సురేశ్కు ఇచ్చి పెళ్లి చేశారు.
పెళ్లి సమయంలో రూ.3.5లక్షలు వరకట్నంగా ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత కొన్నాళ్లపాటు హన్మకొండలో ఉన్న సురేశ్, వీణలు 2014లో చేర్యాల పట్టణానికి వచ్చి లహరి పశువుల మందుల దుకానం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి సత్యప్రణతి(12), లక్ష్మీఅనన్య(7) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నాళ్ల పాటు సాఫీగా సాగిన కాపురంలో గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని వీణని సురేశ్ వేదించసాగాడు. ఈ క్రమంలో గతయేడాది నెల రోజుల పాటు వీణని పుట్టింట్లోనే ఉంచాడు.
తర్వాత కొన్ని రోజులకు సురేశ్ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లి భార్యను కాపురానికి తీసుకొచ్చాడు.
మళ్లీ కొన్నాళ్లకు కట్నం కోసం వేదించడం మొదలు పెట్టాడు. పుట్టింటి నుంచి డబ్బులు తెస్తావా లేదా చస్తావా అని వేదించడం, డబ్బులు తేకపోతే తానే చనిపోతానంటూ బెదిరించడం చేసేవాడు.
దీంతో చేసేది ఏమిలేక సోమవారం ఉదయం వీణ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త సురేశ్తో పాటు అత్తమామలు, ఆడపడుచులు, వారి భర్తలు కలిసి వేధించడం కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వీణ తండ్రి కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.