సంగారెడ్డి, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్: ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం మహాలక్ష్మి పథకాన్ని కలెక్టర్లు ప్రారంభించారు. ఇక ఆర్టీసీ పల్లెవెలుగు,ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. బస్సుల్లో ప్రయాణించే మహిళలు తప్పనిసరిగా ఆధార్, ఓటర్ కార్డు తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఏదో ఒక గుర్తింపుకార్డు చూపాల్సి ఉంటుంది. సంగారెడ్డిలో కలెక్టర్ శరత్, మెదక్లో కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, సిద్దిపేటలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో మొత్తం 308 బస్సులు ఏర్పాటు చేశారు. 101 పల్లె వెలుగు బస్సులు, 207 ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు జీరోఫేర్ టికెట్తో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహాలక్ష్మి పథకం అమలుకు సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి త్వరలో వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్తేర్ ప్రభులత తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలెక్టర్లు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు, బాలికలు, థర్డ్జెండర్ రా్రష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బస్సుల్లో ప్రయాణించే మహిళలు తప్పనిసరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుంది. సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో జిల్లా కలెక్టర్ శరత్ ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో బాలికలు, మహిళలకు జీరో ఫేర్ టికెట్ను అందజేశారు. జీరో టికెట్ అందుకున్న మహిళలు, బాలికలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్టీసీ ఆర్ఎం ప్రభులత పాల్గొన్నారు. మెదక్లో కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. సిద్దిపేటలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రారంభించారు.
ఎనిమిది డిపోల ద్వారా…
మహాలక్ష్మి పథకం ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎనిమిది డిపోల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడం ప్రారంభమైంది. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక డిపోల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణించారు. అన్నిడిపోల పరిధిలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి టికెట్ల తీసుకోకుండా ప్రయాణం చేశారు. ఎనిమిది డిపోల పరిధిలో 308 బస్సుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని బాలికలు, మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. ఎనిమిది డిపోల పరిధిలోని 101 పల్లె వెలుగు బస్సులు, 207 ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు జీరో ఫేర్ టికెట్తో ఉచితంగా పయనించే సౌలభ్యం కల్పించారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అందుబాటులోకి రావడంతో మహిళలు, బాలికలు సంతోషం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, థర్డ్జెండర్ తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్ర సరిహద్దులు దాటితే మాత్రం తప్పనిసరిగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వారం పాటు ఎలాంటి గుర్తింపు కార్డులు అడగమని, ఆ తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డు చూపించి ప్రయాణించాల్సి ఉంటుందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్తేర్ ప్రభులత తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో మహిళలు, బాలికలు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తిగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని చెప్పారు.
ఉచిత బస్సు సేవలను వినియోగించుకోవాలి
మహిళలు ఉచిత బస్సు సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కోరారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలను సిద్దిపేట ప్రభుత్వ జనరల్ దవాఖాన ఆవరణలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన మహిళలు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రవ్యా ప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో సుమారు 40 వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని..అందుకు అనుగుణంగా ప్రయాణికులకు బస్సు సేవలు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. అంతకుముందు కలెక్టర్ బస్సులో జనరల్ దవాఖాన నుంచి పాత బస్టాండ్ వరకు ప్రయాణించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్రెడ్డి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్లో…
మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ పట్టణంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి మహిళ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.