హుస్నాబాద్, ఏప్రిల్ 15 : పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అనభేరి, సింగిరెడ్డి స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసే ప్రమా దముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అకౌంట్లో రూ.15లక్షలు తదితర హామీలు నెరవేర్చలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చినా బీజేపీ చేసేదేమీ లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చితే ప్రశ్నించే గొంతుకలు మాయమవుతాయని, ఏకపక్ష ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వకుండా పనిచేసే నాయకుడిని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్థాయికి ప్రజలు ఎదగాలన్నారు. సమావేశంలో మల్లేశ్, వనేశ్, సంజీవరెడ్డి, మల్లారెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.