వర్గల్, ఫిబ్రవరి 3: ఇన్నాళ్లూ సర్కారు తుమ్మలు మొలిచి, బీడువారిన పొలాలతో కనిపించిన వర్గల్ ప్రాంత భూములు వరుసగా మూడోసారి విడుదల చేసిన గోదావరి నీళ్లతో తాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఢోకాలేని పాడిపంటలతో తులతూగే పసిడి నేలలుగా మారాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. వర్గల్ మండల కేంద్రం శివారులో గోదావరి జలాలను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి శుక్రవారం వదిలారు. వర్గల్లోని జవహర్ నవోదయ విద్యాలయ సమితి దగ్గరలో ఉన్న సంగారెడ్డి లిఫ్ట్ కెనాల్ పాయింట్ వద్ద నుంచి చౌదర్పల్లి పెద్ద చెరువులోకి ఈ నీటిని కాలువ ద్వారా వదిలారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు పసుపు, కుంకుమలు, చీరసారెలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తి కావొద్దని ఎన్ని కుట్రలు చేసినా మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం గర్వించదగ్గ మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను నిర్మించారన్నారు. ఏడాదిన్నర కాలంగా హల్దీవాగు పరీవాహక ప్రాంతాల్లో, బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా ఏడాది పొడువునా రెండు పంటలు ఎండిన మాటే లేదన్నారు. తెలంగాణ తరహా మోడల్ అభివృద్ధి సాధించడం కేసీఆర్తోనే సాధ్యమని నమ్మి నేడు ఇతర రాష్ర్టాలవారు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మర్కూక్, వర్గల్ మండలాల ఎంపీపీలు పాండుగౌడ్, లతా రమేశ్ గౌడ్, జడ్పీటీసీలు బాలమల్లు యాదవ్, మంగమ్మ రామచంద్రం, బీఆర్ఎస్ పార్టీ వర్గల్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.