హుస్నాబాద్, అక్టోబర్ 08 : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉన్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ఏయే అవసరాలు, ఏయే సమస్యలు ఉంటాయో సీఎం కేసీఆర్కు తెలుసుకాబట్టే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
శుక్రవారం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో హుస్నాబాద్ పట్టణంతో పాటు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే గౌరవెల్లి రిజర్వాయర్ పనులు సత్వరంగా పూర్తి కావాలంటే భూనిర్వాసితులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని కోరారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చినట్లే ఎకరాకు రూ.11.50లక్షలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ నిర్వాసితులు ముందుకు రాకపోవడం సరికాదన్నారు.
ఇప్పటికైనా సహకరించి పరిహారం తీసుకోవాలని కోరారు. ఇంకా పట్టుదలకు పోయి ప్రభుత్వం కఠిన నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధిపై కొన్ని పార్టీల నాయకులు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్లమ్మ చెరువు అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అభివృద్ధిపై ఇంత చిత్తశుద్ధి ఉన్నవారు కేంద్ర నుంచి వచ్చే నిధులను ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు.
జీఎస్టీ ద్వారా వచ్చే డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదో కేంద్రాన్ని నిలదీసే సత్తా ఉందా అని ప్రశ్నించారు. అవగాహన లేని ఆరోపణలు మానుకొని అభివృద్ధిలో కలిసి రావాలని హితవు పలికారు.
కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, ఎంపీపీ మాలోతు లక్ష్మీ, వైస్చైర్పర్సన్ అనితారెడ్డి, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, బొజ్జ హరీశ్, వేణు, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.