బెజ్జంకి, ఏప్రిల్ 18: ఆరు గ్యారెంటీలు అని చెప్పి గద్దెనెక్కి మోసం చేసిన కాంగ్రెస్ను, తెలంగాణ ఏమీ చేయని బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థికి బోయిన్పల్లి వినోద్కుమార్కు మద్దుతుగా నిర్వహించిన బహిరంగ సభ, రోడ్ షోలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంతఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి మాటతప్పిండన్నారు. రెండు లక్షల రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్కు ఓటు వేయ్యాలి.. రుణమాఫీ కానోళ్లు బీఆర్ఎస్ ఓటు వేయలని కోరారు. రైతు భరోసా, వడ్లకు, మక్కలకు రూ.500 బోనస్ ఏమైందని కాంగ్రెస్ను హరీశ్రావు ప్రశ్నించారు. ప్రభుత్వం చేతకాని తనంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు రూ.1800 అమ్ముకుంటూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాం లో మద్దతు ధరకు గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని గుర్తు చేశారు.
కౌలు రైతులకు రూ.15, వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఇస్తే, నేడు కాంగ్రెస్ పాలనలో 14గంటల కరెంట్ మాత్రమే వస్తున్నదన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క మోటర్ కాలలేదని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక ఎందుకు పెద్ద సంఖ్యలో మోటర్లు కాలుతున్నయో రైతులు ఆలోచించాలన్నారు. కరోన కష్టకాలంలో రైతుబంధు వేశామని, రైతుబీమా ఇచ్చినామన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ మోసం పోయే పరిస్థితి వస్తుందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. నాలుగు వేల పింఛన్ ఇస్తామని, నాలుగు నెలలైందని, ఇప్పటికీ పింఛన్లు ఇవ్వ డం లేదన్నారు. జనవరి నెల పిం ఛన్ డబ్బులు ఎగ్గొట్టింది రేవంత్రెడ్డి ప్రభుత్వం అన్నారు. పింఛన్దారులకు రేవంత్రెడ్డి ఎనిమిది వేలు బాకీ పడ్డాడని, ప్రతి మహిళకు రూ.12 వేలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. ప్రతి మహిళకు ప్రభుత్వం రూ.పది వేలు బాకీ పడిందని, అవి తీర్చాక గ్రామాల్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిలదీయాలన్నారు. కేసీఆర్ ఉండగా కల్యాణలక్ష్మీకి లక్ష రూపాయల సహాయం చేస్తే..రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో లక్షతోపాటు తులం బంగారం ఇస్తాని మాట చెప్పి తప్పినట్లు హరీశ్రావు తెలిపారు.
ఎంపీగా వినోద్కుమార్ వేయి కోట్ల రూపాయల నిధులు తెచ్చి కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేశాడని, కరీంనగర్కు రైలు, జాతీయ రోడ్లు తెచ్చిండని, ప్రజల మనిషి వినోద్కుమార్ను మనం ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని హరీశ్రావు కోరారు. బండి సం జయ్ ఐదేండ్లలో ఒక్క రూపాయి పని చేయలేదన్నారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై జరిగిన దాడి ని ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రకటించారు. బహిరంగంగా సభ కు ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో మం డల కేంద్రం ప్రజలతో కిక్కిరిసింది. కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఎం పీపీ లింగాల నిర్మల, పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, వైస్ఎంపీపీ సబిత, ఎంపీటీసీ శారద తదితరులు పాల్గొన్నారు.