దుబ్బాక / దుబ్బాక టౌన్, మే 4 : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మగా మారింది… పూర్తిగా రివర్స్ గేర్లో నడుస్తుంది… నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను మెల్లమెల్లగా పక్క దారి పట్టిస్తుంది. ఇలాంటి ప్రభుత్వం ఇంకా ఎన్ని నెలలు ప్రజలను మోసం చేయలేదు’ త్వరలోనే ప్రజలు సరైన రీతిలో బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ చౌరస్తాలో జరిగిన రోడ్షోకు దుబ్బాక మున్సిపల్, మండలంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి హరీశ్రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు ఇక సాగవన్నారు. గత ఐదు నెలలుగా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక కేసీఆర్ తిట్లతో దేవుడి మీద ఒట్లతో కాలం వెల్లదీస్తుందన్నారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను సీఎం రేవంత్రెడ్డి ఇష్టానురీతిలో మాట్లాడటం సరైన విధానం కాదన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక కేసీఆర్ను తిట్టడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఐదు నెలలుగా ఇస్తామన్న రూ.4వేల పింఛన్, ఆడబిడ్డలకు 2,500 నగదు, కేసీఆర్ కిట్, రైతుబంధు, తులం బంగారం వంటి హామీలు ఇంకెంత కాలం సాగదీస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి పుట్టిందని, ధాన్యం కల్లాలకు వచ్చినా రైతుబంధు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రూ. 50వేల తులం బంగారం ఉన్నప్పుడు ఇచ్చిన హామీ నేడు బంగారం రూ.75 వేలకు చేరింది. కందిపప్పు రూ.170, సిమెంట్ రూ.70 పెరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని పెరుగుడే తప్పా తగ్గుడు లేదన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని ధరలకు “రెక్కలే రెక్కలు… గోవిందా గోవిందా’ అంటూ హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
కారు, కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కేసీఆర్కు అండగా ఉండాలని ఆయన కోరారు. దుబ్బాకలో కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ధి కోసం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సేవ చేసేందుకు వచ్చే వెంకట్రామిరెడ్డిని ఆశీర్వదించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన సత్తాను మరోసారి ఎంపీ ఎన్నికల్లో చూపాలన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు దుబ్బాకలో చెల్లని రూపాయి అని, ఢిల్లీలో ఏవిధంగా చెల్లుతాడన్నారు. బీజేపీ, కాంగ్రెస్కు ఓటు వేస్తే వృథా అవుతుందని ప్రజలు కేసీఆర్ వెంట ఉండాలని కోరారు. రఘునందన్రావును మూడోసారి ఓడించి తీరుతామని, రాముని బొమ్మతో ఓట్లు రావని, తాము కూడా 20 ఏండ్లుగా రాములోరి లగ్గం, ఉత్సవాలు చేస్తున్నామని, ఏనాడు రాముడిని వాడుకొని ఓట్లు అడుగలేదన్నారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చేపట్టబోయే సేవా కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత, జట్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, మనోహర్, సోలిపేట సతీశ్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కత్తి కార్తీక, స్థానిక నాయకులు గుండెల్లి ఎల్లారెడ్డి, పల్లె వంశీగౌడ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.