మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 11: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్కు చెందిన బాకి మొగిలి అనే రైతు తనకున్న ఓ బోరు బావి సహాయంతో ఎకరం పొలంలో వరిని సాగు చేశాడు. ఎకరం పొలం దాదాపుగా ఎండిపోయింది. వడ్లూరి కనకాచారి అనే రైతు రెండెకరాల పొలంలో వరి వేశాడు. బావి నీళ్ల సహాయంతో పొలాన్ని పారిస్తున్నారు. దీంతో పదిగుంటల పొలం ఎండిపోయింది. ఇటీవల కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు, బావుల నీటిమట్టం తగ్గిపోయింది. దీనికితోడు తరుచుగా కరెంట్ ట్రిప్ అవుతుండడంతో నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. నెర్రెలిచ్చిన పొలాలను తడిపేందుకు రైతులు నానా తంటాలు పడిన ఫలితం లేకపోతున్నది. దీంతో చేసేదేమి లేక రైతులు వరి చేనులో పశువులు, జీవాలను మేపుతున్నారు.
పచ్చని పంటలు ఎండిపోయి పశువుల పాలవుతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంటలు ఎండిపోతే కుటుంబాలను ఎలా పోషించుకునేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చెరువు, కుంటల నిండా నీళ్లు ఉండడంతో బోరుబావుల్లో నీళ్లుండేవని, ప్రస్తుతం చెరువు, కుంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేండ్లుగా కరువు అనేది లేదని, మళ్లీ పాత రోజులు దాపరిస్తున్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే చెరువు, కుంటలను నింపాలని, ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.