హత్నూర, ఏప్రిల్ 15: జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలద్వారా రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. సోమవారం మండల కేంద్రమైన హత్నూర, చీక్మద్దూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ, తాలు లేకుండా చూసి కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద నీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విద్యుత్ దీపాలు తదితర వసతులు కల్పించాలన్నారు. జిల్లాలో 211 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని లక్షా 96 వేల 519 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన వారంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలుంటే 08455276155కి కాల్చేసి ఫఙర్యాదు చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో కాసేపు మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాదురి, డీఆర్డీవో జ్యోతి, డీసీవో ప్రసాద్, డీపీఎం కొండల్రావు, డీఎస్వో వనజాక్షి, ఐకేపీ డీపీఎం చాయాదేవి, ఏడీఏ అరుణ, తహసీల్దార్ ఫర్హీన్షేక్, ఏపీఎం దేవేందర్, ఏపీవో ప్రవీన్రావు, ఆర్ఐ శ్రీనివాస్, సీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 15: జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అగ్నిమాపక వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు వారం రోజులపాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గోదాములు, షాపింగ్మాల్స్, పాఠశాలలు, సినిమా థియేటర్లు, దవాఖానలు తదితర ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా యజమానులను అప్రమత్తం చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ మనోజ్, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, ఏడీఎఫ్వో సుధాకర్, సీఐ శ్రీకాంత్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.