చిలిపిచెడ్(కొల్చారం), మే 4: మెదక్ జిల్లా చిలిపిచెడ్, కొల్చారం మండలాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనానికి శనివారం సివిల్ సైప్లె డీఎం హరికృష్ణ స్పందించారు. కొల్చారం మండలం దుంపలకుంట రైస్మిల్ వద్ద మెదక్-సంగారెడ్డి రోడ్డుపై నిలిచిన లారీలను త్వరగా ఖాళీ చేయాలని, రోజుకు 12 నుంచి 15 లారీల వరకు అన్లోడ్ చేయాలని, బయట రైస్మిల్ ఆన్చేసి రోజుకు ఐదు లారీల బియ్యం అందజేయాలని రైస్మిల్ యజమానికి డీఎం ఆదేశించారు. రైస్మిల్కు వచ్చిన లారీలను త్వరగా అన్లోడ్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం తీసుకోవాలని యజమాని గౌరీశంకర్కు సూచించారు. చిలిపిచెడ్ మండలం చిట్కుల్లో సోమక్కపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల అవుతున్నా కేవలం రెండు లారీల ధాన్యం మాత్రమే తరలించారని తెలియజేయడంతో డీఎం అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. చిట్కుల్ కేంద్రం నుంచి నిత్యం మూడు లారీ ధాన్యం తరలించాలని సోమక్కపేట పీఏసీఎస్ సీఈవో పోచయ్యకు ఆదేశించారు. చిలిపిచెడ్ మండలం నుంచి రోజుకు 15 లారీల ధాన్యాన్ని అల్లాదుర్గం, రాంపూర్ రైస్మిల్లులకు తరలించాలని సీఈవోకు ఆదేశించారు. తమ సమస్యలపై కథనాన్ని ప్రచురించి అధికార యంత్రాంగంలో చలనాన్ని తెచ్చినందుకు ‘నమస్తే తెలంగాణ’కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.