సిద్దిపేట, ఏప్రిల్ 27: తెగించి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, దీనికోసం ఎన్నో పోరాటాలు, తాగ్యాలు చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిషరించారు. ఈ సందర్భంగా తన్నీరు హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్య మం కోసం 2001లో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేసి, నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేసి టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవులకు కేసీఆర్ రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. ఎన్నో అవమానాలు ఎదురైనా తట్టుకుని రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదని, మన రాష్ట్రం లేకుంటే సిద్దిపేట జిల్లా అయ్యేది కాదన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమన్నారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను కేంద్రం, ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టి అమలుచేశాయన్నారు. రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే మోడల్గా నిలిపితే, నేడు కాంగ్రెస్ సర్కారు తిరోగమం పాలుచేసిందన్నారు. హామీలపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామంటే, ఈ జిల్లా ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామా చేయమంటే వెన్నుచూపిన వ్యక్తులు కిషన్రెడ్డి, రేవంత్రెడ్డి అని హరీశ్రావు విమర్శించారు. ఈ నాయకులు ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులు వొత్తి తెలంగాణకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ఎన్నోసార్లు పదవులకు రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు వంగా నాగిరెడ్డి, ఎంపీపీ మాణిక్యరెడ్డి, మచ్చ వేణుగోపాల్రెడ్డి, కొండం సంపత్రెడ్డి, మోహన్లాల్, బాల సాయిరాం, గ్యాదర్ రవీందర్, అల్లం ఎల్లం, ఆయా మండలాల పార్టీల అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చీ రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాపై కక్షగట్టింది. బీఆర్ఎస్ హయాంలో మెదక్కు 100 సీట్లతో మెడికల్ కళాశాలను కేసీఆర్ మంజూరు చేస్తే, సీఎం రేవంత్రెడ్డి దానిని 50 సీట్లకు కుదించి కొడంగల్ తీసుకుపోయిండు. గజ్వేల్కు కేసీఆర్ కేటాయించిన రూ.150 కోట్ల నిధులను రద్దుచేశాడు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు మంజూరైన రోడ్ల నిధులును రద్దుచేసిండు. అనేక అభివృద్ధి పనులు ఆపిండు. సిద్దిపేట నుంచి కార్యాలయాలను, విద్యాలయాలను తరలించేందుకు కుట్ర చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామని అంటున్నారు. ప్రజలారా ఆలోచించండి. మనపై కక్షగట్టిన కాంగ్రెస్కు ఓటుతో బుద్దిచెప్పండి.
– సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు