మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 27: తెలంగాణ ఉద్యమం దేశానికే ఆదర్శమని, బీఆర్ఎస్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్పనేత కేసీఆర్ అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీలు సుభాష్రెడ్డి, యాదవరెడ్డి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి తదితరులతో కలిసి పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల పోరాటం, ఎన్నో త్యాగాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారని గుర్తు చేశారు. కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని కాంగ్రెస్ సర్కారు చూసిందన్నారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అగ్రభాగానికి దూసుకెళ్లినట్లు తెలిపారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో సంక్షేమ స్వర్ణయుగం అన్నారు. బీఆర్ఎస్ జెండా మోస్తున్న కార్యకర్తలకు పాదాభివందనం తెలియజేస్తున్నట్లు పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. తెలంగాణ అమరుల త్యాగం మరువలేనిదని, వారి ఆకాంక్షల సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.
మెడికల్ కళాశాల సీట్లు కుదించడం తగదు…
బీఆర్ఎస్ హయాంలో మెదక్కు 100 సీట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 50 సీట్లకు కుదించడం అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. మరో 50 సీట్లతో సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొండంగల్లో మెడికల్ కళాశాలను ప్రారంభించడం బాధాకరమన్నారు. మెదక్ కళాశాలకు 100 సీట్లు మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం పదేండ్లలో తెలంగాణకు ఏమి చేయలేదన్నారు. దుబ్బాకలో అనేక హామీలిచ్చి ఓటమి పాలైన రఘునందన్ను మెదక్ బీజేపీ అభ్యర్థిగా నిలిపారని, ఇక్కడి ప్రజలు అతన్ని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ ఆభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని క్యాడర్ను ఆమె కోరారు. మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ సరిగ్గా అమలు చేయలేదన్నారు. ఏడుపాయల దేవస్థానానికి గత ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరూ చేస్తూ జీవో జారీ చేసిందని, ఆ నిధులు ఏమయ్యాయని మెదక్ ఎమ్మెల్యేను పద్మాదేవేందర్రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ వచ్చి ప్రజలకు కష్టాలు తెచ్చింది
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలకు కష్టాలు తెచ్చిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మాట తప్పిందన్నారు. రైతు భరోసా పెంచుతున్నామని చెప్పి పెంచలేకపోయారని విమర్శించారు. వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, కో కన్వీనర్లు లింగారెడ్డి, గడ్డమీది కృష్ణాగౌడ్, పార్టీ మెదక్ మండల అధ్యక్షులు అంజాగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, బట్టి లలిత, జయరాజ్, కిశోర్, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, చంద్రకళ, నాయకులు సోములు, చింతల నర్సింహులు, సంగ శ్రీకాంత్, గట్టేశ్, నగేశ్, శ్రీనివాస్, జగదీశ్, జుబేర్, శ్రీనివాస్గౌడ్, మేడిశెట్టి, శంకర్, కిరణ్, అజ్గర్అలీ, సున్నం నరేశ్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గ్గొన్నారు.