గజ్వేల్, జనవరి 12 : ఈనెల 18న ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సూచించారు. గురువారం గజ్వేల్ పట్టణంలోని చాకలి ఐలమ్మ భవనంలో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తారని, ఆపరేషన్ అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్సలు చేస్తారని తెలిపారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఆత్మకమిటీ చైర్మన్ వేమారెడ్డి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, ఏఈ శ్రీధర్రెడ్డి, కౌన్సిలర్లు చందు, గోపాల్రెడ్డి, రహీం, బాలమణి శ్రీనివాస్, మెట్టయ్య, భాగ్యలక్ష్మీదుర్గాప్రసాద్, శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు రాజు, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.
ఈనెల 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం..
ఈనెల 18న ప్రారంభంకానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల పరిధిలోని అహ్మదీపూర్లో ఏఎన్ఏం, ఆశ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దృష్టిలోపం ఉన్న ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏంపీడీవో మశ్చేంద్ర, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయప్రద, ఏంపీవో సురేందర్, సర్పంచ్ నవీనాశ్రీనివాస్రెడ్డి, నాయకులు రమేశ్గౌడ్, అహ్మద్, ఖాజామొయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగును విజయవంతం చేయాలి..
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, డిప్యూటీ డీఎంహెచ్వో సౌమ్య పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని సర్కారు దవాఖానలో కంటి వెలుగు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న ప్రతిఒక్కరూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అనిత, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, కౌన్సిలర్ నళినీదేవితోపాటు పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అందరూ సమష్టిగా పనిచేయాలి..
కంటి వెలుగు కార్యక్రమం విజయవంతానికి అందరూ సమష్టిగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలోని 24వ వార్డులో మహిళా సమాఖ్య భవనం, నీలకంఠేశ్వర దేవాలయం, శాలివాహన కుమ్మరి సంఘం, 21వ వార్డులో ఉర్దూ మీడియం పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల సహకారంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. క్యాంపుల వద్ద టేబుల్స్, కుర్చీలు, తాగునీరు సదుపాయం కల్పించాలన్నారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు ఉన్నారు.