సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ బడులంటే అప్పటి పాలకులకు చిన్నచూపు ఉండేది. దీంతో సర్కారు విద్య బలహీనపడింది. ఇరుకైన తరగతి గదులు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు..అరకొర వసతులు వెక్కిరించేవి. విద్యార్థులుంటే టీచర్లు ఉండేవారు కాదు.. టీచర్లు ఉంటే పాఠాలు సాగేవి కావు. దీంతో అప్పట్లో పేదలకు నాణ్యమైన విద్య అందలేదు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సర్కారు బడుల రూపురేఖలు మారిపోయాయి. ప్రైవేట్కు దీటుగా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం చేపట్టి సర్కారు విద్యను బలోపేతం చేస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్, బుక్స్, నోట్బుక్స్ అందజేస్తున్నది. కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నది. దీంతో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. మాకు ఒక్క సీటు ఇప్పించండి సారూ..అంటూ వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడుతున్నారు. దీనికి ఉదాహరణగా సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, ప్రశాంత్నగర్లోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలను చెప్పవచ్చు. ఈ పాఠశాలల్లో అడ్మిషన్లు ఫుల్ అని గేటు వద్ద బోర్డులు పెట్టారు. ఈ బడుల్లో అడ్మిషన్ కోసం మంత్రి హరీశ్రావు, ఇతర ప్రజాప్రతినిధులు, పైఅధికారులతో రికమెండ్ చేయాల్సిన పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.
-సిద్దిపేట/ సిద్దిపేట అర్బన్, జూలై 14
సిద్దిపేట అర్బన్, జూలై 14: మాకు ఒక్క సీటు ఇప్పించండి సారూ.. అంటూ వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు రోజు పాఠశాలకు క్యూ కడుతున్నారు. విద్య, విజ్ఞానం, పోటీతత్వంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా దూసుకెళ్తూ ‘అడ్మిషన్లు ఫుల్’ అని ఏటా గేటు వద్ద బోర్డు పెట్టే అరుదైన సన్నివేశం కనబడుతున్నది. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీ రు హరీశ్రావు కృషితో పాఠశాల సకల హంగులు, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చి, పలు పాఠశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సిద్దిపేట పట్టణంలో ఉన్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల. పాఠశాలలో అడ్మిషన్ దొరకాలంటే మంత్రి హరీశ్రావు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో విజ్ఞప్తులు చేయాల్సిన పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. 2023 సం వత్సరంలో ఇందిరానగర్ పాఠశాల నుంచి 32 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సంపాదించారు. ఎనిమిదేండ్ల నుంచి ప్రవేశాల కోసం క్యూ కడుతున్న ఇందిరానగర్ పాఠశాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ట్రిపుల్ ఐటీలో అత్యధిక సీట్లు
ఇటీవల వెలువడిన బాసర ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ఇందిరానగర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 32 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. ఇందిరానగర్ పాఠశాలలో మొత్తం పదో తరగతి పరీక్ష రాసిన 253 మంది విద్యార్థులకు 249 మంది ఉత్తీర్ణత సాధించి 98.5 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇటీవల వెలువడిన సప్లిమెంటరీ ఫలితాల్లో అందరూ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందు లో 6 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. 26మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 21 మంది 9.7, 17 మందికి 9.5, 18మంది 9.3, 27 మంది 9.2, 21 మంది 9.1 జీపీఏ సాధించారు.
సర్కారు బడికి సిఫారసు సంతోషం..
సర్కారు బడి అర్థం మార్చారు. సహజంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సీట్ల కోసం మాకు విజ్ఞప్తులు వస్తాయి. కానీ, ఒక మంత్రిగా సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో సీటు ఇప్పించాలని సిఫారసు కోసం నా వద్దకు రావడం సంతోషంగా ఉంది. రాష్ర్టానికే ఇందిరానగర్ హైస్కూల్ ఆదర్శంగా ఉండాలి.
-తన్నీరు హరీశ్రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి
అన్ని తరగతుల్లో అడ్మిషన్లు ఫుల్
ఆరేండ్ల క్రితం 300మంది విద్యార్థులున్న పాఠశాలలో క్రమక్రమం గా సీట్లు పెంచుతున్నా.. విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ సెక్షన్లు పెరుగుతున్నాయి. ఆరో తరగతిలో ప్రవేశాలకు 230 సీట్లు ఉం డగా, 361కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే అన్ని తరగతులల్లో అడ్మిషన్లు నిండిపోగా, ఆరో తరగతిలో దరఖాస్తుల కోసం రోజూ చాలా మంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నారు.
23 సెక్షన్లు.. 1,276 మంది విద్యార్థులు
తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఇందిరానగర్ ఉన్న త పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 300 ఉండేది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ, ఉపాధ్యాయుల సమష్టి కృషితో 1276 మంది విద్యార్థులు చేరారు. 2023-24 విద్యాసంవత్సరానికి పాఠశాలకు మొత్తం 701 దరఖాస్తులు రాగా, ప్రభుత్వ పాఠశాలల నుంచి 410మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి 291 దరఖాస్తులు వచ్చాయి. ఏటా 500 మంది విద్యార్థులకు పైగా సీటు రాక వెనుతిరిగే పరిస్థితి కనిపిస్తున్నది. పాఠశాలలో 1,276 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 23 సెక్షన్లుగా విభజించి తరగతులు బోధిస్తున్నారు. 2023 పదో తరగతి ఫలితాల్లో 6 మంది విద్యార్థులకు 10 జీపీఏ రాగా, 32 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించారు.
సౌకర్యాల కల్పనతోనే పాఠశాల అభివృద్ధి
మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అన్నిరకాల సదుపాయాలు సమకూర్చారు. పాఠశాల భవనాన్ని పునరుద్ధ్దరించడంతో పాటు నాట్కో సంస్థ సహకారంతో ఆరు అదనపు తరగతులు నిర్మించారు. ఈ-పామ్ వారి సహకారంతో పాఠశాలలో డిజిటల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాలలో సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ కోసం భవనం, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సదుపాయం, సోలార్ పవర్ యూ నిట్, మోడల్ వంటశాల, వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. పాఠశాలలోని ప్రతి తరగతి సీసీ కెమెరాలకు అనుసంధానం చేశారు. పాఠశాలలో ప్రతి రికార్డు ఆన్లైన్లోనే నిక్షిప్తం చేసి ఉంచుతున్నారు. పాఠశాల విద్యార్థులు అన్నిరకాల పోటీ పరీక్షలు, అకాడమీ ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వడంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో, సైన్స్, రోబోటిక్స్, గూగుల్ కోడింగ్, యోగా తదితర అంశాలను నేర్పిస్తారు. నేషనల్ మీన్స్ కమ్ మెరి ట్ స్కాలర్షిప్కు 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు లభించాయి.
ఫారెన్ లాంగ్వేజెస్పై శిక్షణ..
యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ) యూనివర్సిటీ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల్లో ప్రపంచస్థాయి కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచే విధంగా ఇంగ్లిష్ భాషతోపాటు ఫ్రెంచ్, స్పాని ష్ భాషలను సైతం బోధిస్తున్నారు. ఈ మేరకు ఇప్లూ.. ఇందిరానగర్ జిల్లా పరిషత్ పాఠశాలను దత్తత తీసుకున్నది. మొదటి బ్యాచ్లో భాగంగా 90మంది విద్యార్థులకు ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలపై శిక్షణ ఇచ్చారు. మరో 90 మంది విద్యార్థులకు స్పానిష్ లాంగ్వేజీపై శిక్షణ కొనసాగుతున్నది.
ఇప్పటికే అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి..
ఇప్పటికే పాఠశాలలో అడ్మిషన్లు పూర్తయ్యాయి. సీటు కోసం ఎంతో మందితో విజ్ఞప్తులు చేసే పరిస్థితి ఉంది. కానీ, మొదటగా కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే అవకా శం కల్పిస్తాం. ప్రభుత్వ పాఠశాలతోపాటు ప్రైవేట్ పాఠశాలల నుంచి వందల కొద్ది దరఖాస్తులు వస్తున్నాయి. నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తాం. అన్ని తరగతుల్లో సీట్లు భర్తీ అయ్యాయి. ఖాళీలు ఏర్పడితే సీట్లు ఇస్తాం. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి.
– సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల
ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చా
నా పేరు టి.శశికాంత్. నేను సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుకున్నాను. ఇందిరానగర్ పాఠశాలలో చేరితే మంచి చదువు వస్తుందనే మా తల్లిదండ్రులు చేర్పించారు. వచ్చిన దగ్గర నుంచి పాఠాలు శ్రద్ధగా వింటున్నా. టీచర్లు చాలా బాగా చెబుతున్నారు.
– టి.శశికాంత్, 6వ తరగతి విద్యార్థి
అన్ని సౌకర్యాలు బాగున్నాయి
నా పేరు ఏ. శ్రేష్ఠ, పట్టణంలో నివాసం ఉంటా ను. గతంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 5 తరగతి చదివా ను. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను బోధిస్తున్నారు. చాలామంది మా తల్లిదం డ్రులకు సలహా ఇవ్వడంతో పాఠశాలలో చేరాను. మంచి సౌకర్యాలు ఉన్నాయి.
– ఎ.శ్రేష్ఠ, 6వ తరగతి విద్యార్థి
హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా
నా పేరు చరణ్. నేను ఇందిరానగర్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. మాది నం గునూరు మం డలం నాగరాజుపల్లి గ్రామం. బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను. నేను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదివాను. ఉపాధ్యాయులు చాలా బాగా బోధిస్తున్నారు.
-చరణ్, 6వ తరగతి విద్యార్థి