దుబ్బాక, జూలై 12 : రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే.. జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు రైతుల జీవితాలతో చలగాటమడుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగాన్ని చీకటి రోజుల్లోకి తీసుకెళ్ల్లేందుకు కాంగ్రెస్ మరో కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్పై విషంకక్కిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం దుబ్బాక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు చెప్పులతో కొట్టి , అనంతరం దహనం చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు లు సుభిక్షంగా ఉంటే.. చూసి ఓర్వలేక కాంగ్రెస్ రైతులపై మళ్లీ కరెంట్ కష్టాలను పెట్టేందుకు కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు సీఎం కేసీఆర్ రైతుబంధు, ఉచిత కరెంట్, సాగునీరు అందిస్తుంటే.. జీర్ణించుకోలేని కాంగ్రెస్ రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రైతు ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నామని, సంతోషాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఒర్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం పంట పొలాల వద్ద పడిగాపులు కాసిన సందర్భాలను ఆయన గుర్తుచేశారు. కోతల కరెంట్తో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే బోరు మోటర్లతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కెన దుస్థితి నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంటూ మండిపడ్డారు. గత పాలకులు వ్యవసాయాన్ని దండుగ చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. వెలుగుల్లో ఉన్న రైతులను కాంగ్రెస్ తిరిగి చీకటి రోజుల్లోకి నెట్టేందుకు కర్కశత్వంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల్లో డబ్బులు, ప్రైవేటు కంపెనీల కమిషన్ల కోసం రేవంత్రెడ్డి కరెంట్ను విక్రయించేందుకు కుట్ర పన్నతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ మోసాలను రైతులు గమనిస్తున్నారని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్లు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, కోమటిరెడ్డి వెంకటనర్సింహరెడ్డి, గుండెల్లి ఎల్లారెడ్డి, గన్నె భూంరెడ్డి, కొత్త కిషన్రెడ్డి, చెక్కపల్లి పద్మయ్య, వంశీగౌడ్, బనాల శ్రీనివాస్, జీడిపల్లి రవి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.