హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని ఉత్తిష్ఠ గణపతికి నవరసాభిషేకం పంచామృత అభిషేకం, హరిద్రా కుంకుమ విలీపన అభిషేకం నిర్వర్తించారు. రుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం అనంతరం 51 కిలోల పెరుగన్నం, మిర్యాలపొడితో స్వామివారిని రుద్రగణపతిగా అలంకరించారు.
రుద్రగణపతిగా స్వామివారిని అలంకరించిన తర్వాత అన్నపూజ, పుష్పార్చన జరిపారు. హైదరాబాద్కు చెందిన పరమశివ భక్తులు శ్రీ వెంకటసాయి ఆనంద విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఈ అన్నపూజా కార్యక్రమం నిర్వహించారు. తెలుగు అకాడమీ ఛైర్మన్ కూరపాటి వెంకటనారాయణ బంధువులతో కలిసి దేవాలయానికి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు, మణికంఠశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.