Aryajanani – Siddipeta | సిద్దిపేట పట్టణంలోని స్థానిక విపంచి ఆడిటోరియంలో హైదరాబాద్ కు చెందిన రామకృష్ణ మఠం ఆర్యజనని ఆధ్వర్యంలో గర్భిణులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. గర్భిణిలకు అవసరమైన సలహాలు, సూచనలను అందిస్తూ నార్మల్ డెలివరీ లక్ష్యంగా అవగాహన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలను, పురాణేతిహాసాలను చక్కగా వివరిస్తూ ఒక కొత్తతరం ఈ భూమి మీదకు రావడానికి కృషి చేస్తున్న రామకృష్ణ మఠం నిర్వహిస్తున్న ఆర్యజననికి తల్లులంతా ఋణపడి ఉంటారన్నారు. రాష్ట్రంలో 90 శాతం ప్రసవ సమయంలో వివిధ కారణాలతో సిజేరియన్లు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆర్యజనని ప్రయత్నం ప్రశంసనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ పరమహంస భక్తులు దశరథ్, ఆర్యజనని బృందానికి చెందిన డాక్టర్ అనుపమ, శ్రీమతి వృషాలి, శ్రీమతి మాధవి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గర్భిణిలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని పంపిణీ చేశారు.