సిద్దిపేట, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆటో కార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే పలు సంఘాలు వివిధ కార్యక్రమాలకు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి మా పొట్ట కొట్టిందంటూ ఆటోకార్మికులు మండిపడ్డారు. ఉపాధి కోల్పోయిన తమ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు మెదక్ జిల్లా నర్సాపూర్, నిజాంపేట, రామాయంపేట డివిజన్, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు వందలాదిగా ఆటోలతో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పాల సాయిరామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికుల జీవితాల్లో చీకటి నింపిందన్నారు. సుమారు 50 లక్షల ఆటో కార్మికుల జీవితాలు రోడ్డు పాలయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఆటో కార్మికుల పొట్టకొట్టింది. రూపాయి రూపాయి జమ చేసి ఈఎంఐలు చెల్లిస్తున్నారు. రోజూ ఆటో నడిస్తే కానీ పూట గడవని కార్మికులు.. ఒక వైపు ఆటో ఈఎంఐలు.. మరో వైపు కుటుంబ పోషణ భారంగా మారింది. తమ బతుకులు రోడ్డు పాలయ్యాయంటూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు వందలాదిగా ఆటోలతో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఆటో క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పాల సాయిరామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మూడు చక్రాల ఆటో కార్మికుల జీవితాల్లో చీకటి నింపిందన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. సుమారు 50 లక్షల ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికుల జీవితాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం జీవనభృతి నెలకు రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో లేని సమాజాన్ని ఊహించలేమని, ఆటో కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతను పరిగణించాలన్నారు. ఆటో నడిస్తేనే వారి జీవన చక్రం నడుస్తుందని, ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నిరసన తెలిపిన ఆటోడ్రైవర్లు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో మా బతుకుదెరువు కోల్పోయామంటూ మండల ఆటో డ్రైవర్ల సంఘం సభ్యులు నిరసన తెలిపారు. శనివారం మండలంలోని కానుకుంటలో ఆటోడ్రైవర్ల యూనియన్ సంఘం అధ్యక్షుడు గుండగళ్ల వెంకటేశ్, డ్రైవర్లు సంయుక్తంగా నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ డ్రైవర్ల సంఘం సభ్యులు నీరుడిమల్లేశ్, రాజు, మురళి, లక్ష్మణ్, పోచయ్య, నాగరాజు పాల్గొన్నారు.
నిజాంపేటలో నిరసన
నిజాంపేట, డిసెంబర్16 : ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ఎంతో మంది ఆటో డ్రైవర్ల నోట్లో మట్టి కొడుతుందని నిజాంపేట సీతారామాంజనేయ ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు అన్నారు. శనివారం నిజాంపేట ప్రధాన రహదారిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు జాల పోచయ్య, అబ్దుల్పాషా, అర్జున్, అబ్దుల్, బాబు, నాగరాజు పాల్గొన్నారు.
ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రకటించడంతో అటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని చౌరస్తా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించి, ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు శ్రీనివాస్, నాగభూషణం, కుమార్, మోసిన్, అలీ, సత్యనారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు.