సిద్దిపేట అర్బన్ : జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రానున్న రెండు, మూడు రోజుల్లో వంద శాతం ప్రారంభించేలా సన్నాహాలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో సుమారు ఒక లక్షా 79 వేల రైతుల నుంచి 6 లక్షల 86 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు మూడు రోజుల్లో నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. వరి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగొద్దని ప్రతి మూడు నుంచి 5 కేంద్రాలకు క్లస్టర్ అధికారులను నియమించినట్లు ఆయన వెల్లడించారు. రైతు పండించిన పంట మిల్లుకు డెలివరీ కావడం ప్రధానంగా చూడాలని, అన్లోడింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసే దిశగా మిల్లర్లు సహకరించాలని పేర్కొన్నారు.
ధాన్యం మూమెంట్పై ట్రాన్స్పోర్ట్ తదితర అంశాలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేసేలా అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రతి రైస్ మిల్లులో సరిపడా హమాలీలు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. మిల్లింగ్ కెపాసిటీ పెంచాల్సిన అవసరం తదితర విషయాలపై త్వరలోనే మంత్రి హరీశ్రావుతో విశ్లేషించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమీక్షలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, ట్రైనీ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్డీఏ పీడీ గోపాల్రావు, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి హరీశ్, డీసీవో, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, రైస్ మిల్లర్లు, మండల ప్రత్యేక అధికారులు, తాసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు.