సిద్దిపేట, జనవరి 12 : క్రికెట్ క్రీడాకారులకు శుభవార్త. సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్-3 సమరానికి త్వరలో ప్రారంభం కానున్నది. దీనికి సిద్దిపేట సిద్ధమవుతున్నది. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో రెండు సీజన్లుగా నియోజకవర్గ యువతకు ఈ టోర్నీ నిర్వహించారు. ఈ పోటీలు క్రీడా స్ఫూర్తిని రగిలించి అనేక మంది గ్రామీణ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో జట్లకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగేందుకు దోహదం చేశాయి. ఈ క్రీడా పోటీల మూడో సీజన్కు తెరలేచింది. ఈ నెల 13 నుంచి నుంచి నియోజకవర్గ స్థాయిలో జట్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్లు మచ్చ వేణుగోపాల్రెడ్డి, కల్వకుంట్ల మల్లికార్జున్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ టోర్నమెంట్కు సంబంధించిన సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ వాల్పోస్టర్, దరఖాస్తు ఫారాన్ని వారు ఆవిష్కరించారు.
నియోజకవర్గ స్థాయిలో టోర్నీ నిర్వహణ..
సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో గ్రామాలు, సిద్దిపేట మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో క్రీడాకారులు ఈ టోర్నీలో ఆడనున్నారు. ఇప్పటికే ఈ టోర్నమెంట్ కోసం సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ క్రికెట్ స్టేడియాన్ని సిద్ధ్దం చేస్తున్నారు. మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో జరగునున్న సీజన్-3 క్రికెట్ పోటీలు అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలతో పాటు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి గ్రామం నుంచి ఒక జట్టుకు, వార్డు నుంచి ఒక జట్టుకు అవకాశం కల్పిస్తారు. రెండో సీజన్లో సూమారు 250కి పైగా టీమ్లు రాగా, ఈసారి అదేస్థాయిలో జట్లు పోటీల్లో పాల్గొననున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో క్రికెట్ క్రీడాకారులు తమ ప్రాక్టీస్ను ప్రారంభించారు.
విజేతకు రూ.2లక్షల ప్రైజ్మనీ..
సీఎం కేసీఆర్ క్రికెట్ కప్ సీజన్-3లో విజేతకు రూ.2 లక్షలు, రన్నర్కు రూ.లక్ష, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు రూ.50వేలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు రూ.1000, ప్రతి సిక్స్కు రూ.500 అందించనున్నట్లు వేణుగోపాల్రెడ్డి, మల్లికార్జున్ తెలిపారు. టీమ్ల ఎంట్రీలను ఈ నెల 13నుంచి తీసుకోనున్నారు. క్రీడాకారులు తమ జట్ల దరఖాస్తులు ఇచ్చేటప్పుడు ప్రతి క్రీడాకారుని ఆధార్ కార్డును జతపరచాలన్నారు. ఒక జట్టులో ఆడిన క్రీడాకారుడు మరో జట్టులో ఆడితే ఆ జట్టులో ఆడేందుకు అనుమతించమని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన రిఫరీలు, అంపైర్లతో, బీసీసీఐ నిమయ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు ప్రవీణ్కుమార్, నాగరాజురెడ్డి, సాయికుమార్గౌడ్, నాయకులు ప్రశాంత్, బుచ్చిరెడ్డి యాదగిరి,రమేశ్, బజ్జి, మాజిద్, బాబు పాల్గొన్నారు.