సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్ల సందర్బంగా నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులను వేదికపైకి పిలవడం దురదృష్టకరమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు. శనివారం సిద్దిపేట హరిత హోటల్లో నిర్వహించిన సమావేశానికి మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha) ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెన్ (Congress) నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని వేదికపైకి పిలవడాన్ని ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి కొండ సురేఖ, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. అధికారుల తీరును నిరసిస్తూ సమావేశాన్ని ఎమ్మెల్యే బహిష్కరించారు. అనంతరం పల్లా మీడియాతో మాట్లాడారు.
సంప్రదాయాలకు , ఆచారాలకు వ్యతిరేకంగా మల్లన్న ఆలయం సన్నిధిలో నిర్వహించాల్సిన సమావేశం హోటళ్లలో పెట్టడం సరికాదని విమర్శించారు. శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో భక్తులను దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను సమావేశం నుంచి వెళ్లిపొమ్మనడం విచారకరమని అన్నారు.