ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా యంత్రాంగమంతా క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా వర్షం పరిస్థితులను తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అత్యవసర, అవసరమైన ఆదేశాల జారీ చేస్తున్నారని, వాటిని అనుసరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రాజెక్టులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నుంచి ప్రజలను తరలించాలన్నారు. మత్స్యకారులు చెరువుల్లోకి వెళ్ల్లకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల ఆలయం వద్ద వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇండ్లు కూలిన ప్రజలకు అండగా నిలిచి ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. రాత్రివేళ వర్షం ఎకువగా కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని మంత్రి హరీశ్రావు సూచించారు.
– సిద్దిపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, జూలై 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధతపై సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇంజినీర్ అధికారులతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా వర్షం, వరద గురించి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, అత్యవసర, అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని, వాటిని అనుసరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ మండలాల ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రాజెక్టులు, చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వరద, వర్షం నీటికి రహదార్లు పాడవడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని, అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలకు నీరు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాటర్ ఫ్లోతో ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలని కోరారు. నిత్యం కురస్తున్న వర్షానికి గోడలు బాగా తడిచి ఉంటాయని, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను తరలించి తాతాలిక క్యాంపులు, రిహాబిలిటేషన్- పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులు నిండి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మత్స్యకారులు ఎవరు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు.
మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల వద్ద వరద ఉధృతి నెలకొన్న దృష్ట్యా మానిటరింగ్ చేయాలని మంత్రి హరీశ్రావు సూచించారు. మెదక్ జిల్లాలో 157, సిద్దిపేట జిల్లాలో 257, సంగారెడ్డి జిల్లాలో 227 ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, బాధితులకు అండగా నిలవాలన్నారు. వారికి ప్రభుత్వం తరపున ఆర్థికసాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సిద్దిపేటలో పూర్తిగా నిండిన 714 చెరువులను అధికారులు పరిశీలించి కలెక్టర్లకు సమాచారం అందించాలన్నారు. కేసీఆర్ కిట్ సమాచారం ఆధారంగా డెలివరీకి సిద్ధంగా ఉన్న గర్భిణుల వివరాలు ముందుగా తెలుసుకొని వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. 3, 4 రోజులకు ముందే అడ్మిట్ చేసుకోవాలన్నారు. అన్నపూర్ణ, తోటపల్లి, రంగనాయక సాగర్తో పాటు ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్ల పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. రాత్రివేళ వర్షం ఎకువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయకచర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 27: రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. గురువారం ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కాల్వలు, వాగులు, చెరువుల వద్ద, ఓవర్ ఫ్లో అవుతున్న రోడ్లు, బ్రిడ్జిల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నిండిన చెరువులపై నివేదిక ఇవ్వాలన్నారు. సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం నిల్వల గురించి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ అజయ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. 7.23 టీఎంసీల నీరు చేరితే పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ నిండుతుందని మంత్రికి వివరించారు. నిండేందుకు రెండు మూడు టీఎంసీల నీటికి ముందే గేట్లను నెమ్మదిగా ఎత్తాలని మంత్రి సూచించారు. నల్లవాగు ప్రాజెక్టు, నారింజ వాగులను పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చెరువులను బండ్వాక్ చేసి తనిఖీ చేస్తున్నామని తెలిపారు. బుంగపడిన ఒక చెరువుకు, 3 చెరువులకు చిన్నచిన్న మరమ్మతులు చేశామన్నారు. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు చోట్ల రోడ్లపై నీరు ప్రవహిస్తున్నదని, ఆయా రోడ్లను బ్లాక్ చేసినట్టు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.