Sad News | అక్కన్నపేట, ఏప్రిల్ 17: బుడిబుడి అడుగులు.. వచ్చీ రానీ మాటలు.. అల్లరి చేష్టలు.. అప్పటిదాకా గోరుముద్దలు తినిపించిన తల్లి.. అంతలోనే విషాదం.. కంటికి రెప్పాలా కాపాడుకుంటున్న కొడుకు.. కోతుల కారణంగా రేకులపై నుంచి బండ రాయి జారి పడి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కట్కూరులో సోమవారం జరిగింది.
కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్కూరుకు చెందిన దేవునూరి శ్రీకాంత్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అభినవ్ (33 నెలలు) ఆరు నెలల కిందట ఇంట్లో ఆడుకుంటూ ఉండగా కడప తట్టుకుని పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న ఓ కత్తి గొంతులోకి దిగింది. వెంటనే హన్మకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లి, రూ.5 లక్షల వరకు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. అప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయట్టపడ్డాడు. సోమవారం మధ్యాహ్నం తల్లి రజిత కొడుకు అభినవ్కు తినిపిస్తుండగా కోతులు ఇంట్లోకి రావడంతో కొడుకును తీసుకుని బయటకొచ్చింది. కొడుకును ఇంటి ఎదుట ఉన్న రేకుల బయట నిలబెట్టి ఇంట్లోకి వెళ్లింది. అప్పటికే రేకులపై ఉన్న మరికొన్ని కోతులు ఎగురడంతో వాటిపై ఉన్న బండ రాయి జారి కింద ఉన్న బాలుడి తలపై పడింది. దీంతో బాలుడి తల నుజ్జునుజ్జు అయ్యింది. శబ్ధం విని బయటకొచ్చే సరికే అభినవ్ మృతిచెందాడు. బాలుడి మృతి తీరు చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. కొంత కాలంగా గ్రామంలో కోతుల బెడద ఎక్కువైందని గ్రామస్తులు ఆందోళన చెందుతుండగా, నివారణ చర్యలు చేపట్టాలని సర్పంచ్ జిల్లెల అశోక్రెడ్డి కోరారు. బాలుడు అభినవ్ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం నెలకొన్నది.
‘కత్తి దిగిన రోజు చనిపోయినావు అనుకున్నా కొడుకా.. పైసలు పోయినా పర్వాలేదు అనుకున్నం కొడుకా.. నువ్వు బతికితే సంబరపడ్డం బిడ్డా.. ఏ దేవుడి గుళ్లో మన్నుపోసినం కొడుకా.. ఆరు నెలలుగా నీతో సకల బాధపడుతున్నాం బిడ్డా.. నువ్వు మళ్లా బతికితే మంచిగుండు కొడుకా” అంటూ ఆ బాలుడి తల్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తీరు అందరినీ కలిచివేసింది. గతంలో ఆడుకుంటూ గడుప (కడుప) తట్టుకొని పడడంతో గొంతులో కత్తి దిగింది. దీంతో లక్షలు పోసి ఆ పసి ప్రాణాన్ని దక్కించుకున్న ఆ తల్లిదండ్రులు విధి రాతలో మాత్రం ఓడిపోయారు.