India US Trade Deal | అమెరికాతో భారత్ చేసుకోనున్న వాణిజ్య ఒప్పందంపై దేశ రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఇప్పటివరకు ఒప్పందంపై సంతకాల ప్రక్రియ జరగలేదు. అయితే, ఈ ఒప్పందం జరిగితే భారత్లోని వ్యవసాయరంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులు, రైతు సంఘాల నేతలు ఆవేదనతో నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. ఒప్పందం విషయం తెరపైకి రాగానే రైతు సంఘాలు ఆందోళనబాటపట్టాయి. నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పలువురు రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. రైతు సంఘాల నేతలతో హర్యానా ప్రభుత్వం చర్చలు జరిపింది. ఒప్పందం గురించి కేంద్రంతో చర్చలు జరుపుతామని, అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. అయితే, వాణిజ్య ఒప్పందం వ్యవహారం రైతుల్లో నివురుగప్పిన నిప్పులా రగులుకుంటూనే ఉన్నది.
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం జరిగి అమల్లోకి వస్తే, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ మార్కెట్లోకి అనుమతిస్తారు. అది భారత వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇటీవల రైతు నాయకుడు సర్వన్సింగ్ పంధేర్ మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయశాఖతో సమావేశం ఏర్పాటు చేయడానికి హర్యానా ప్రభుత్వం అంగీకరించిందని, చర్చల తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రైతు ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, సున్నితమైన ఉత్పత్తుల దిగుమతిని చర్చల పరిధి నుంచి మినహాయించామని కేంద్రం ప్రకటించింది.
కేంద్రంతో చర్చలు జరుపుతామని హర్యానా ప్రభుత్వం చెప్తున్నా, రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని కేంద్రం చెప్తున్నా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. అమెరికా నుంచి చౌక ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు అనుమతిస్తే మన దేశ రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని కిసాన్ మజ్దూర్ మోర్చా సహా పలు రైతు సంఘాలు చెప్తున్నాయి. అమెరికా రైతులతో పోల్చితే భారతీయ రైతులకు ప్రభుత్వ మద్దతు చాలా తక్కువ.
కాబట్టి అమెరికా రైతులతో భారత రైతులు పోటీ పడటం చాలా కష్టం. భారీగా రాయితీలు పొందే అమెరికా రైతుల వ్యవసాయ ఉత్పత్తులు భారతీయ మార్కెట్లోకి వస్తే మన దేశీయ పంటల ధరలు పడిపోవడంతోపాటు రైతుల ఆదాయం దెబ్బతింటుంది. ప్రస్తుతం కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి కోసమే ఒప్పందం అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ భవిష్యత్తులో పాల ఉత్పత్తులు, పరిశ్రమలు, డిజిటల్ వాణిజ్యం, ఈ-కామర్స్, ప్రభుత్వ కొనుగోళ్లు, మేధో సంపత్తి హక్కులు,సేవల రంగానికి విస్తరించే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసి, రైతులు, సాధారణ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. పంజాబ్లో రైతులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతులు వాణిజ్య ఒప్పంద పత్రాల ప్రతులను తగలబెడుతున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తుందని మండిపడుతున్నారు. భారత ప్రయోజనాలు దెబ్బతినకుండా రైతులు, కార్మికులు, వినియోగదారులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పుకొస్తున్నది. కానీ ఏదైనా ఒప్పందానికి ముందే తేలాలని, తర్వాత కుదరదని రైతు సంఘాలు తేల్చిచెప్తున్నాయి.
అమెరికాతో భారత వాణిజ్య ఒప్పంద వ్యవహారం కొన్ని నెలలుగా సాగుతున్నది. తాత్కాలిక ఒప్పందం కూడా ఇంకా ఖరారు కాలేదు. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం భారత్ చేసిన కొన్ని డిమాండ్లపై అమెరికా హామీలు ఇవ్వకపోవడంతోనే ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తున్నది. ఒకసారి ఒప్పందం కుదిరిన తర్వాత కొత్త సుంకాలు ఉంటాయో, ఉండవో అమెరికా స్పష్టంగా చెప్పడంలేదు. కొత్తగా సుంకాలు విధించబోమంటూ ఎలాంటి హామీ కూడా ఇవ్వడంలేదు. దీంతో చర్చల ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు రైతులు పలు డిమాండ్లను పెడుతున్నారు. అమెరికా ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతిస్తే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి చర్చల దశలోనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్టు రైతు సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం హద్దులు దాటి వ్యవహరించబోదని కేంద్రం చెప్తున్నప్పటికీ, ఒప్పందంపై సంతకం చేసే ముందే స్పష్టమైన హామీలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కేంద్రంతో చర్చల తర్వాత తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశాయి.
(ఇండియాటుడే సౌజన్యంతో సోనూ వివేక్)