పజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దు
సమన్వయ లోపంతోనే ప్రజలకు ఇబ్బందులు
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
హవేళీ ఘనపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
హవేళీఘనపూర్, జూలై 28: వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలు పరిష్కరించాలని, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన హవేళీఘనపూర్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెవెన్యూ అధికారులు ప్రజల ఇబ్బందులు తీర్చకుండా లేనిపోని సాకులు చూపి తిరిగి పంపిస్తున్నారని సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ సీఎం కేసీఆర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో నూతన మండలాలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అవగాహన కల్పించి, సమస్య ఏ రకంగా పరిష్కారమవుతుందో అర్థమయ్యేలా చెప్పాలే తప్ప వారిని నిత్యం కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రైతుల పంట పొలాలకు రోడ్డు సదుపాయం కల్పించేలా చూడాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని శాలిపేట గేటు వద్ద కాకుండా సుల్తాన్పూర్ గ్రామ శివారులోని మంగమ్మగుట్ట వద్ద ఏర్పాటు చేసేలా పరిశీలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగమ్మగుట్ట వద్దకు మార్చడం ద్వారా పర్యాటకులకు మంచి వాతావరణంతోపాటు గుట్ట ప్రాంతంలో పర్యాటకులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలని, లైన్మెన్లు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ఇబ్బందులుంటే అధికారులు తమ దృష్టికి తేవాలని, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాజ్పేట మీదుగా కొత్తపల్లి వరకు ఆర్టీసీ బస్సు నడుపాలని స్థానిక సర్పంచ్ సంధ్యారాణి సభా దృష్టికి తీసుకురాగా.. నెల రోజుల పాటు ఆర్టీసీ బస్సు నడిపితే లాభనష్టాలెలా ఉంటాయో నెలలోపు వివరాలు అందజేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ శేరి నారాయరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఎంపీడీవో శ్రీరామ్, తహసీల్దార్ దశరథ్, వైస్ ఎంపీపీ రాధాకిషన్యాదవ్, మండల కో- ఆప్షన్ సభ్యులు ఖాలేద్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కసిరెడ్డి మాణిక్యరెడ్డి, గ్రామసర్పంచ్లు సవిత, లింగం, యామిరెడ్డి, మహిపాల్రెడ్డి, రాజేందర్రెడ్డి, చెన్నాగౌడ్, పీఎసీఎస్ చైర్మన్ బ్రహ్మం, ఎంపీటీసీలు మంగ్యా, కిష్టాగౌడ్, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.