హుస్నాబాద్, జూన్ 21 : గౌరవెల్లి రిజర్వాయర్ మిగులు పనులు, పరిహారం చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.89కోట్ల నిధులు మంజూరు చేసింది. గౌరవెల్లి రిజర్వాయర్లో నీళ్లు నిం పేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్తోపాటు నీటిపారుదల ఈఎన్సీ అధికారులను ఆదివారం జరిగిన సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం ఆదేశించారు. దీంతో గౌరవెల్లి కి మహర్దశ పట్టినట్లేనని హుస్నాబాద్ ప్రాంత రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో జిల్లా యంత్రాం గం గౌరవెల్లి రిజర్వాయర్ పనులపై ప్రత్యేక దృష్టిసారించింది. రిజర్వాయర్లో పనిచేస్తున్న అధికారులతోపాటు పనులు చేస్తు న్న కాంట్రాక్టర్లతో హుస్నాబాద్ ఆర్డీవో అత్యవసర సమావేశం నిర్వహించి పనులను సమీక్షించారు. ఇంకా చెల్లించాల్సిన పరిహారం, చేయాల్సిన పనులపై ఆరాతీశారు. రెండు నెలల్లోపు పనులు పూర్తి చేసి టన్నెల్ ద్వారా నీటిని సర్జిఫుల్ పంపుహౌస్కు తరలించి, అక్కడి నుంచి మోటర్ల ద్వారా రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసేందుకు కావాల్సిన చర్యలను ముమ్మరం చేశారు. కలెక్టర్ వెంకట్రాంరెడ్డి సైతం సీఎం ఆదేశాల ప్రకారం గౌరవెల్లిని సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
90శాతం పూర్తయిన రిజర్వాయర్ పనులు…
అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ శివారలో నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. రూ.1095.99కోట్లతో రిజర్వాయర్, రూ.770 కోట్లతో టన్నెల్, పంపుహౌస్ నిర్మాణం చేపట్టగా, ఇందులో దాదాపు పనులు చివరి దశకు చేరుకున్నాయి. 1056 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ కట్ట నిర్మాణం జరగాల్సి ఉండగా, కేవలం అరకిలోమీటరు కట్ట నిర్మాణం మాత్రమే మిగిలింది. కట్టకు రాతికట్టడం దాదాపు పూర్తయింది. కోహెడ మండలం నారాయణపూర్ నుంచి 12 కిలోమీటర్ల వరకు సొరంగమార్గం నిర్మాణం సైతం పూర్తయింది. రిజర్వాయర్ పక్కనే నిర్మిస్తున్న సర్జిఫుల్ పంపుహౌస్లో ఒక్కోటి 32మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు మోటర్ల బిగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 50 ఎంవీఏ సామర్థ్యం కలిగిన ఐదు భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో సర్జిఫుల్ పంపుహౌస్ పనులు పూర్తవుతాయని ఈఈ రమేశ్ తెలిపారు.
3,836 ఎకరాల భూసేకరణ…
గౌరవెల్లి రిజర్వాయర్ కోసం ఇప్పటి వరకు 3,836ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఇందులో 272 ఎకరాల భూసేకరణ కోర్టులో కేసులతో పెండింగ్లో ఉంది. ఈ భూమికి సైతం అధికారులు ఇటీవల ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తికానుందని అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్ పరిధిలో మొత్తం 1,124 కుటుంబాలు ఉండగా, ఇందులో 937 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ పరిహారం చెల్లింపులు జరిగా యి. ఇంకా 182 కుటుంబాల కు మాత్రమే చెల్లింపులు చేయా ల్సి ఉంది. మొత్తం 742 ఇండ్ల కుగాను 35 ఇండ్లకు మినహా మిగతా అన్ని ఇండ్లకు పరిహా రం చెల్లించారు. 2015 కటాఫ్ తేదీతో లెక్కించి అప్పటి వరకు ఉన్న 144 మంది తాజా మేజర్లకు సైతం ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున చెల్లించింది. ఇటీవల ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన రైతులకు చెల్లింపు జరిగితే నష్టపరిహారం సంపూర్ణంగా ముట్టినట్లే.