సిద్దిపేట, మే 02( నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా అన్యాయం చేసిన ప్రధాని మోదీకి కర్రుకాల్చి వాత పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గురువారం సిద్దిపేటలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నూతన బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీలో మంత్రి కొండా సురేఖ,పార్టీ నాయకులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. నిధులు ఇవ్వకుండా, జాతీయ ప్రాజెక్టులు ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మన ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు. సీఎం హోదాలో సిద్దిపేటకు తొలిసారి వచ్చిన రేవంత్రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రోడ్ షోతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడ్దారు.
బాబూ జగ్జీవన్రావు విగ్రహం నుంచి పాత బస్టాండ్ వరకు ట్రాఫిక్ మళ్లించడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సీఎం రోడ్ షోకు ఆశించినంత జనం రాలేదు. పాత బస్టాండ్ వద్ద ఉన్న ప్రాంతం పూర్తిగా నిండలేదు. పాత బస్టాండ్ సర్కిల్ నాలుగు వైపులా రోడ్డు పూర్తిగా నిండితే సుమారుగా 10 వేల మంది పడతారు. కానీ, అంత జనం కాంగ్రెస్ సభకు రాలేదు.ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరి గ్రూపులు వారివే..ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. కరెంట్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ఎస్ఈ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు మొత్తం సభ దగ్గర ఉండి విధులు నిర్వర్తించారు. సభ సజావుగా ముగియడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.