ఉద్యమాల పురిటిగడ్డ.. అభివృద్ధి పూదోట… గులాబీ కంచుకోట సిద్దిపేట. ఎన్నికలు ఏవైనా ఇక్కడ ఎగిరేది గులాబీ జెండానే. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆరుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత స్థానంలో మంత్రి హరీశ్రావు ఆరు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. మొదటి ఎమ్మెల్యే పీడీఎఫ్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎడ్ల గురువారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పి.రాజేశ్వర్రావుపై గెలుపొందారు. కమ్యూనిస్టు పార్టీ ప్రభావం ఉన్నప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గ ముఖచిత్రం కేసీఆర్ చేతిలోకి వెళ్లిపోయింది.
సిద్దిపేట నియోజకవర్గానికి తొలిసారి ఎన్నికల్లో ఎడ్ల గురువారెడ్డి పీడీఎఫ్ పార్టీ నుంచి, తర్వాత ఎన్నికల్లో పీవీ నాగేశ్వర్రావు కాంగ్రెస్ పార్టీ, సోమేశ్వర్రావు స్వతంత్ర, పీవీ రాజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. పీవీ రాజు మంత్రిగా పనిచేశారు. అనంతుల మదన్మోహన్ 1970లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగా తనదైన ముద్ర వేశారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఏడుసార్లు పోటీచేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడి నుంచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన వారిలో కేసీఆర్ ఒకరు. నాలుగు సార్లు టీడీపీ నుంచి, రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ప్రత్యేకత చాటారు. తొలుత 1983లో టీడీపీ తరఫున సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీచేసి తన రాజకీయ గురువైన మదన్మోహన్ చేతిలో కేవలం 879 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం మధ్యంతర ఎన్నికల్లో 1985లో సిద్దిపేట నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్రెడ్డిపై తొలిసారిగా విజయం సాధించారు. అప్పటి నుంచి సిద్దిపేటను తన కంచుకోటగా మలుచుకున్నారు. 1985లో టీడీపీ తరఫున 16,156 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా వరుస ఎన్నికల్లో 1989లో 13,816 ఓట్ల మెజార్టీ, 1994లో 27,107 ఓట్ల మెజార్టీ, 1999లో 27,555 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరఫున కేసీఆర్ వరుసగా గెలుపొందారు. 2001లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 58,712 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నూతన జిల్లాగా సిద్దిపేట ఏర్పాటైంది. కొత్త మండలాలు సైతం ఏర్పాటయ్యాయి. సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాలు ఉన్నాయి. మొదటిసారి 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల మదన్మోహన్ చేతిలో స్వల్పఓట్ల తేడాతో ఓడిపోయారు. 1985లో సిద్దిపేట నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ మాటకు తిరుగులేదు. సిద్దిపేట ప్రజలు కేసీఆర్, హరీశ్రావు వెంటే ఉన్నారు. ఈ సెగ్మెంట్లో ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థులు డిపాజిట్లు కాపాడుకోవడానికే కష్టాలు పడుతున్నారు.
సిద్దిపేట మంత్రి హరీశ్రావు అడ్డ…ఇక్కడి నుంచి మంత్రి హరీశ్రావు ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థుల డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా తన రాజకీయ చతురతతో ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. 2004 అక్టోబర్లో మొదటిసారి సిద్దిపేట శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేశారు. ఈ ఎన్నికలో తన సమీప టీడీపీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 24,827 ఓట్ల మెజార్టీతో హరీశ్రావు గెలుపొందారు. అప్పటి నుంచి విజయాలతో దూసుకెళ్తున్నారు. తర్వాత ప్రతి ఎన్నికల్లో తన మెజార్టీని తానే అధిగమిస్తూ ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేస్తూ తిరుగులేని నేతగా ఎదిగారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 64,014 ఓట్ల మెజార్టీ సాధించి తన రికార్డును తానే తిరగరాశారు. 2010లో మరోసారి జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక రికార్డు మెజార్టీతో నంబర్-1గా నిలిచారు. 2014 ఎన్నికల్లో హరీశ్రావుకు 1,08,699 ఓట్లు రాగా తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్కు 15,371 ఓట్లు, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్కు 13,003 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో హరీశ్రావు 93,328 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్రావుకు 1,31,295 ఓట్లు రాగా తన సమీప అభ్యర్థి భవానీరెడ్డి (టీజేఎస్) 12,596 ఓట్లు, బీజేపీ అభ్యర్థి నరోత్తంరెడ్డికి 11,266 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మంత్రి హరీశ్రావు 1,18,699 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి లక్షా యాభై వేల ఓట్ల మెజార్టీ సాధించాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో పలు గ్రామాలు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేశారు.