‘సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నాం.. పట్టణాన్ని అభివృద్ధి చేసుకొని, నేడు అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపాం’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లాకేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. కుల సంఘాల భవన నిర్మాణాలకు ప్రొసీడింగ్స్తో పాటు పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్, బీమా చెక్కులను అందజేశారు. డీఎంహెచ్వోతో కలిసి వెల్నెస్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సింగ్ కళాశాలను సందర్శించి, మొదటి బ్యాచ్ విద్యార్థులతో విద్యాబోధనపై ఆరా తీశారు. సిద్దిపేటలో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణంలో అవసరమైన చోట రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు ఇచ్చామన్నారు. తడి, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి, బయోగ్యాస్, ఎరువులు తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చెత్త రహిత పట్టణమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
– సిద్దిపేట, జూలై 20
సిద్దిపేట జూలై 20: ‘సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నాం… పట్టణాన్ని నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ఆదర్శంగా నిలిపాం..సిద్దిపేటను చూసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి అధికారులు వస్తున్నారని’ అని ఆర్థిక,వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని 14వ వార్డులో రూ.1.20కోట్లతో వరద కాల్వ, డ్రైనేజీ, ఫుట్పాత్నిర్మాణ పను లు,15వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 14వ వార్డులోని ముస్తాబాద్ చౌరస్తా నుంచి శివాజీ చౌరస్తా వరకు రూ.1.20 కోట్లతో వరద కాల్వ, డ్రైనేజీ, ఫుట్పాత్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలో చాలా చోట్ల రోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించామన్నారు.14వ వార్డులో సీసీరోడ్లు, మురుగు కాల్వ నిర్మాణానికి రూ.50లక్షలు మంజారు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పట్టణంలోని ప్రతి ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తతో పొడి చెత్తను రీసైక్లింగ్ చేసున్నారని, నిత్యం 10 నుంచి 15 టన్నుల తడి చెత్తతో బయోగ్యాస్ తయారు చేస్తున్నామని, మరో 15 నుంచి 20 టన్నుల తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2522 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 756 క్యూబిక్ మీటర్ల గ్యాస్, 579 టన్నుల సేంద్రియ ఎరువు తయారు చేసినట్లు తెలిపారు. బుస్సాపూర్ డంపింగ్యార్డులో చెత్త కుప్పలు లేకుండా పోయాయన్నారు. సిద్దిపేటలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి త్వరలో రూ.3లక్షలు మంజారు చేస్తామని, 57 ఏండ్లు దాటిన వారికి త్వరలో పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కవిత, కౌన్సిలర్ విఠోబా, నాయకులు రవీందర్రెడ్డి, పాలసాయిరామ్, మచ్చ వేణుగోపాల్రెడ్డి, దండుగుల రాజ్యలక్ష్మి, గుండు భూపేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గంప రామచందర్, మహేందర్ మేర్గు మహేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ నం గునూరు మండల అధ్యక్షుడు దేవులపల్లి కృష్ణ పార్టీకి రాజీనామా చేసి బుధవారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో దేవులపల్లి రాజశేఖర్, రాకేశ్,పాకాల రమేశ్, చేర్యాల రమేశ్, శివ ఉన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
సిద్దిపేట,జూలై 20: సిద్దిపేట పట్టణంలో పలు కుటుంబాలను మంత్రి హరీశ్రావు బుధవారం పరామర్శించారు. పట్టణంలోని 15వ వార్డు ఇమాంబాద్ మాజీ సర్పంచ్ బాలయ్య ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరి డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్ తల్లి పోచమ్మ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పోచమ్మ చిత్రపటానికి పూల వేసి నివాళులర్పించారు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు చెందిరెడ్డి రాజశేఖర్రెడ్డి తల్లికి ఇటీవల యశోద దవాఖానలో గుండె ఆపరేషన్ చేయగా, విషయం తెలుసుకున్న మంత్రి రాజశేఖర్రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, నరేందర్రెడ్డి ,భాస్కర్భాను ఉన్నారు.
ఎనిమిది గురుకులాలు అప్గ్రేడ్
సిద్దిపేట, జూలై 20 : ‘జిల్లాలో మరో ఎనిమిది గురుకుల పాఠశాలలు ఇంటర్మీడియెట్కు అప్గ్రేడ్ అయ్యాయి.. ఆయా పాఠశాలల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఈడీలతో అప్గ్రేడ్ అయిన గురుకుల పాఠశాలలపై సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్మిషన్లు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాల ని కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ను ఫోన్లో ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల అప్గ్రేడ్ అడ్మిషన్లు, వసతుల కల్పనపై ఆయా శాఖల ఆధికారులతో సమీక్ష చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఎనిమిది గురుకులాలు ఇప్పటికే అప్గ్రేడ్ అయి ఉన్నాయని, శాశ్వత భవనాలు, తాత్కాలిక భవనాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సిద్ది పేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల వారీగా గురుకులాలపై సమీక్షించి ప్రణాళికలు, ప్రతిపాద నలతో కావాల్సిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. అప్గ్రేడ్ అయిన గురుకులాలకు కావాల్సిన వసతుల కల్పన, సిబ్బంది తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించాలని కలెక్టర్కు సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ, బీసీ మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు సరోజ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందిద్దాం
సిద్దిపేట, జూలై 20: ‘వెల్నెస్ సెంటర్కు వచ్చే రోగులతో ఆప్యాయంగా మాట్లాడుదాం…ఉద్యోగులు..జర్నలిస్టు కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందిద్దాం..వెల్నెస్ సెంటర్లో సిబ్బంది పనితీరు మరింత మెరుగు పడాలి’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని వెల్నెస్ సెంటర్ను డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెల్నెస్ సెంటర్లో పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో సిబ్బంది హాజరు పుస్తకం తీసి అందులో ఒక్కొక్కరి విధులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి అందులో ఉన్న రోగుల వివరాలు తెలుసుకొని మంత్రి వారికి స్వయంగా ఫోన్ చేసి వెల్నెస్ సెంటర్లో వైద్య సేవలపై ఆరా తీశారు. కేంద్రంలో 24 మంది సిబ్బంది ఉంటే రోగుల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించారు. ఈ కేంద్రాన్ని మెడికల్ కాలేజీ పరిధిలోకి మరుద్దామా అని సిబ్బందిని ప్రశ్నిస్తూ పనితీరును మార్చుకోవాలని సూచించారు. సిబ్బంది డ్రెస్కోడ్, సమయపాలన పాటించాలన్నారు.
నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో మాటామంతి
సిద్దిపేట నర్సింగ్కాలేజీని మంత్రి సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. విద్యా బోధన.. భోజన వసతులపై ఆరా తీశారు. కళాశాలకు సొంత భవనం మంజూరైందని, త్వరలోనే అన్ని వసతులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, కౌన్సిలర్ దీప్తి, రవీందర్రెడ్డి, వెంకటేశ్వర్రావు, పాలసాయిరామ్, వేణుగోపాల్రెడ్డి, భూపేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గంప రాంచందర్, మేర్గు మహేశ్ పాల్గొన్నారు.
కుల సంఘాల భవనాలకు ప్రొసీడింగ్స్ అందజేత
సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ కులసంఘాల భవనాల నిర్మాణాలకు రూ.40లక్షల ప్రొసీడింగ్స్ను మంత్రి అందజేశారు. నారాయణరావుపేట దివ్యాంగుల భవనానికి రూ.5లక్షలు, సిద్దిపేట పట్టణ ఇత్తడి పారిశ్రామిక సంఘ భవనానికి రూ.10లక్షలు, ఎన్సాన్పల్లి ముదిరాజ్ సంఘానికి రూ.10లక్షలు, చిన్నకోడూరు విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీహాల్కు రూ.10లక్షలు, బక్రిచెప్యాల గ్రామ రజక భవనానికి రూ.5లక్షల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కూర మాణిక్యరెడ్డి, ఓగ్గు బాలకృష్ణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, నాయకులు పాల సాయిరామ్, రమేశ్గౌడ్, కాముని శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.