చేర్యాల, డిసెంబర్ 27 : దారుణ హత్యకు గురైన సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం అంత్యక్రియ లు ఆయన స్వగ్రామం గుర్జకుంటలో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. అందరితో కలుపుగొలుపుగా ఉండే జడ్పీటీసీ మల్లేశం హత్యను గ్రామస్తులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరిస్థితులు అదుపులో ఉన్నాయి. జడ్పీటీసీ మృతదేహం సోమవారం రాత్రి గ్రామానికి వచ్చినప్పటి నుంచి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతత నెలకొంది.మంగళవారం ఉదయం నుంచే గ్రామస్తులుతో పాటు పొరుగు గ్రామా ల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉదయాన్నే గ్రామానికి చేరుకొని అంత్యక్రియల ఏర్పాట్లు, గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ఆరాతీశారు.
అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే అక్కడే ఉండి అధికారులు, పోలీసులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కృషిచేశారు. అంతిమ సంస్కారాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ప్రభుత్వ మాజీ చీప్విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, జడ్పీటీసీలు,ఎంపీపీలు తరలివచ్చారు. జడ్పీటీసీని హత్యచేసిన వారి ఇండ్లు కూల్చేవరకు శవం ఇక్కడి నుంచి కదలించేది లేదని బంధువులు, గ్రామస్తులు మొండికేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జడ్పీటీసీ సతీమణి స్వప్నతో మాట్లాడి హంతకులకు శిక్ష పడేలా చర్య తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో వారు శాంతించడంతో అంతిమయాత్ర ప్రారంభించారు.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు…
జడ్పీటీసీ మల్లేశానికి ఇద్దకు కుమార్తెలు కావడంతో పెద్ద కూతురు లిఖిత తండ్రి అంతిమ సంస్కారాలకు తలకొరివి పెట్టింది.మూడు గంటల పాటు కొనసాగిన అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. గ్రామ వైకుంఠధామం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు.తండ్రి మృతదేహం వద్ద తల్లితో పాటు కూతుళ్ల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.
ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు…
జడ్పీటీసీ మల్లేశం అంత్యక్రియలు ఉద్రిక్తత పరిస్థితుల నడుమ కొనసాగాయి. అంతిమయాత్ర ప్రారంభం కాగానే జడ్పీటీసీ భార్య స్వప్న తన వెంట తీసుకొచ్చిన మట్టిని హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురి ఇండ్లపై చల్లి శాపనార్థాలు పెట్టింది. హత్య చేసినట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన కార్లను మల్లేశం బంధువులు, కొందరు గ్రామస్తులు ధ్వంసం చేయడంతో పాటు వారి ఇంటిపై రాళ్ల్లు, ఇటుకలతో దాడి చేశారు. అనుమానితులుగా భావిస్తున్న వారు అప్పటికే ఇంటికి తాళం వేసి గ్రామం నుంచి వెళ్లిపోవడంతో ఇంటి కిటికీలు, సామగ్రిని ధ్వంసం చేశారు. గుర్జకుంటలో పోలీసుల పికెటింగ్ కొనసాగుతున్నది. జడ్పీటీసీ శెట్టె మల్లేశం అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాడెమోశారు. తీవ్ర ఉద్విగ్నతకు లోనై ఆయన కన్నీరు కార్చారు. ఆయనతో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం కంటనీరు పెట్టారు.
పోలీసులు అదుపులో నిందితులు..?
జడ్పీటీసీ హత్యకు కారకులైన మొత్తం మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.హత్య చేసిన రోజునే గ్రామ ఉప సర్పంచ్ నంగి సత్యనారాయణతో పాటు అనిల్ అనే వ్యక్తులు పోలీసులకు లొంగిపోయినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మంగళవారం గ్రామానికి చెందిన శ్రీరాములు, శ్రీనివాస్, చంద్రకాంత్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వినికిడి. నెల రోజుల క్రితమే గ్రామంలోని ప్రధాన రోడ్డు, ముఖ్య కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను సైతం ఆఫ్ చేసి ఉంచినట్లు సమాచారం. ఇటీవల జడ్పీటీసీని హత్య చేసేందుకు పార్టీ చేసుకున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. జడ్పీటీసీతో పాటు హత్య కేసు లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యనారాయణ సైతం ఇప్పటికే నేరచరిత్ర కలిగి ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు.
సీఎం కేసీఆర్ దృష్టిలో జడ్పీటీసీ హత్య వివరాలు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జడ్పీటీసీ మల్లేశం హత్య కేసులో ప్రత్యేక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. జడ్పీటీసీ మల్లేశం హత్య కేసు వివరాలు సీఎం కేసీఆర్ దృష్టికి సైతం తీసుకుపోయినట్లు తెలిపారు.హత్యలో పాల్గొన్న వ్యక్తులను చట్టం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని, తాను సైతం వారికి శిక్షపడే వరకు కృషి చేస్తానన్నారు.గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేశారని, గ్రామస్తులు, పోలీసులు సైతం సహకరించారన్నారు. గుర్జుకుంటపై ప్రత్యేక దృష్టి పెట్టడడంతో పాటు జడ్పీటీసీ మల్లేశం కుటుంబాన్ని అన్ని విధాలుగా బీఆర్ఎస్ సర్కారు ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.