సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 5: ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మొదలు పెట్టిన గొప్ప కార్యక్రమం ప్రజావాణి అని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో సోమవారం అర్జీదారుల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి సమస్యలు నేరుగా విన్నవించి పరిష్కరించుకోవడానికి అర్జీదారులు ఎంతో ఆశతో కార్యాలయానికి వస్తారని.. వారందరికీ న్యాయం చేయడం మన కర్తవ్యమని అధికారులకు సూచించారు. అర్జీదారుల నుంచి తీసుకున్న ఫిర్యాదులు త్వరగా పరిష్కరించి నివేదిక అందజేయాలన్నారు అర్జీదారులకు ప్రజావాణి కార్యక్రమంపైన నమ్మకం పెరిగిందన్నారు. క్రమక్రమంగా అర్జీదారుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ఎంతో ఉత్సాహంతో పనిచేయాలన్నారు. వివిధ సమస్యలపై మొత్తం 28 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 98 మంది నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంట వెంటనే పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, డీఆర్వో పద్మశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 5 : ప్రజావాణికి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 75 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్వో నగేశ్, ఏవో పరమేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.