వానకాలం వచ్చినా మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తికాలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 498 సెంటర్ల ద్వారా 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. మొత్తం రూ.648.90 కోట్లకు రైతులకు ఇప్పటి వరకు రూ.600 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగతా రూ.47.30 కోట్లు బాకీ పడ్డారు. 14,290 మంది రైతుల నుంచి 59,934 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించారు. ఇందుకు రూ.29.97 కోట్లు బోనస్ చెల్లించారు.
మెదక్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ఈ యాసంగి సీజన్లో మెదక్ జిల్లాలో ధాన్యం సేకరణకు 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 418 కేంద్రాల ద్వారా 2,49,213 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సేకరించగా, 80 కేంద్రాల ద్వారా 59,934 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం రూ.717 కోట్ల విలువైన ధాన్యా న్ని సేకరించగా, రైతులకు రూ. 600 కోట్లు చెల్లించారు. సన్నధాన్యానికి క్వింటాల్కు రూ.500 చొప్పున 14,290 మంది రైతులకు రూ.29.97 కోట్ల బోనస్ చెల్లించారు.
ఇప్పటి వరకు అన్ని కేంద్రాల్లో సేకరణ ముగియగా, 75,371మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించారు. ఈ సీజన్లో మేలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని మండలాల్లోని సెంటర్ల వద్ద ధాన్యం మొలకలు వచ్చాయి. దీంతో రైతులు చేసేదేమీలేక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను ఆరబెట్టి తూకం వేశారు. కేంద్రాల వద్ద అధికారులు కనీసం టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచక పోవడం రైతులు తిప్పలు పడ్డారు.
వానకాలం సీజన్ ప్రారంభం…
ఓ వైపు వర్షాలు కురుస్తున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే రైతులు దుక్కులు దున్ని తుకాలు పోస్తుంటారు. ఈసారి ముందుగానే రుతు పవనాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విత్తనాలను కొనుగోలు చేసి దుక్కులు సిద్ధం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇప్పటికే విత్తనాలను విత్తారు. యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. అంతేకాదు రూ.47.30 కోట్ల డబ్బులు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది.
వేగంగా ధాన్యం సేకరించాం
మెదక్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. అకాల వర్షాల వల్ల ధాన్యం సేకరణలో కొంత ఇబ్బందు లు ఎదురయ్యాయి. అయినా కొనుగోళ్లు వేగంగా పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే రూ. 600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మరో రూ.47.30 కోట్లు రావాల్సి ఉంది.
– జగదీశ్వర్, సివిల్ సప్లయ్ డీఎం, మెదక్