మెదక్ అర్బన్, జూలై 19 : మహిళల భద్రత కోసమే షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బుధవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో జిల్లా షీటీం బృందాలతో ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్నేహపూర్వకమైన పోలీసింగ్ అందించాలనే లక్ష్యంతో మహిళలకు పూర్తిగా సురక్షితమైన భద్రతాపరమైన వాతావరణాన్ని అందించాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం షీటిమ్స్ను ప్రవేశపెట్టిందన్నారు.
మెదక్ జిల్లాలో ఉన్న షీటీమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలో, తెలంగాణ మోడల్ స్కూళలో రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు ర్యాగింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలో షీ టిమ్స్ బృందాలు 1718 సార్లు హాట్స్పాట్లను సందర్శించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మెదక్ డివిజన్ పరిధిలో 13 మందికి కౌన్సెలింగ్, 9 ఈ పెట్టి కేసులు, ఒక ఎఫ్ఐఆర్, తూప్రాన్ డివిజన్ పరిధిలో 13 మందికి కౌన్సెలింగ్, 2 ఈ పెట్టికేసులు, 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీటీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.