సిద్దిపేట అర్బన్, జనవరి 9: జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా చలితో జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరిందంటే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా సోమవారం సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో అత్యల్పంగా 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకూ పెరుగుతున్న చలితో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం 10 గంటలు దాటుతున్నా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే జనవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో జిల్లావ్యాప్తంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఉదయం పొగమంచు కమ్మేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పనులకు వెళ్లే కార్మికులు, కూరగాయలు, పాల విక్రయదారులు నానా అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఇదే ఉష్ణోగ్రతలు నమోదైతే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
పిల్లలు, వృద్ధులు జాగ్రత్త…
డిసెంబర్ చివరి వారం నుంచి మొదలైన చలి తీవ్రత నాలుగైదు రోజులుగా విపరీతంగా పెరిగింది. రాత్రి వేళల్లో ఈదురుగాలులు వీస్తుండడంతో చలి మరింత తీవ్రంగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ మేరకు శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు న్యూమోనియా, స్వైన్ఫ్లూ, ఆయాసం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు రాత్రి, ఉదయం సమయంలో ఎక్కువగా తిరగకూడదని, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తప్పకుండా స్వెట్టర్, మాస్క్ వంటివి ధరించాలని చెబుతున్నారు.