నకిలీ విత్తనాల సరఫరా, నాసిరకం ఎరువులను
అరికట్టేందుకు పటిష్ట చర్యలు
మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ అర్బన్/మెదక్ రూరల్, మే16: నకిలీ విత్తనాలు, ఎరువులను, నాసిరకం పురుగుల మందులను అమ్ముతు రైతులను మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. నకిలీ విత్తనాలు సరఫరా, నాసిరకం ఎరువులు విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తార న్నారు. జిల్లాలో రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను నియమించామని వారి ద్వా రా మండలాల వారిగా వ్యవసాయ అధికారులతో కలి సి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నామని తెలిపా రు. నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి గ్రామంలో పోలీసు అధికారులు వ్యవసాయ రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో ఎవరైనా తక్కువ ధరకు పత్తి విత్తనాలు కానీ ఇతర ఏ విత్తనాలైనా ఇస్తామని మాయమాటలు చెప్పి విక్రయించడానికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలపై ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో నకిలీ విత్తనాల గురించి ఎటువంటి ముందుస్తు సమాచారం తెలిసిన 100కి కానీ 7330671900కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సోమవారం టాస్క్ఫోర్స్ బృందం, ఇన్స్పెక్టర్ అప్ పోలీస్, విత్తన ధృవీకరణ స్థానిక ఏవోలతో కలిసి ఎంఎస్ సూపర్ సీడ్ ప్రైవేట్ లిమిటెడ్, మనోహరాబాద్, శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ, మెదక్, జైభవాని ఫర్టిలైజర్, అల్లాదుర్గం, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం అల్లాదుర్గం, నియో సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మనోహరాబాద్, లక్ష్మీ ట్రేడర్స్ చిల్వర్లలో పత్తి, వరి, మొక్కజొన్న, మిరప, జొన్న విత్తన అభివృద్ధి, పరీక్షలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.