కంటోన్మెంట్. ఆగస్టు 7 : ఈ ఫొటోలో గుట్టలుగా కనిపిస్తున్నవి అక్షరాల ఇందిరమ్మ చీరలు! వీటిని తొమ్మిది నెలల క్రితమే మహిళలకు పంచిపెట్టాల్సి ఉన్నది. కానీ, వాటిని పంచకుండా కంటోన్మెంట్ వర్క్షాపులో ఇలా గుట్టలుగా పడేశారు. వీటి మీద దుమ్మూధూళి పేరుకుపోతున్నది. చివరకు ఎలుకల పాలవుతున్నాయి. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ శుక్రవారం కంటోన్మెంట్ వర్క్షాపులో పేరుకుపోయి ఉన్న ఇందిరమ్మ చీరలను పరిశీలించారు.
ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే శ్రీగణేశ్, ఇతర నాయకులు గత సంవత్సరం నవంబర్లోనే పంచాల్సిన చీరలను మహిళా గ్రూపులకు పంచకుండా కంటోన్మెంట్ వర్క్షాప్లో నిల్వ ఉంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అర్హులైన కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ప్రకటించారని తొమ్మిది నెలలు పూర్తయినా కంటోన్మెంట్లోని మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వలేదని మండిపడ్డారు. వేలాది ఇందిరమ్మ చీరలను వర్క్షాపులో మూలకు పడేయడంపై ఎమ్మెల్యే శ్రీగణేశ్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.