అందోల్, ఏప్రిల్ 7: సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులు మురుగు రాజకీయం చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి ఏడాది కాలంగా రోగాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింకోవడం లేదు. కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు మమ్ముల్ని అడిగితే ఏం చేస్తాం? వెళ్లి కేసీఆర్నే అడగండి అంటూ బెదిరింపులు, దాడులకు సైతం దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందోల్ మున్సిపల్ పరిధిలోని అందోల్(కుమ్మరిగూడెం) డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఇండ్లపక్కనే మురుగు ప్రవహిస్తున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కాలనీలో మురుగు వెళ్లే పైపులైన్లు పాడైపోవడంతో నీరు రోడ్లపై చేరడంతో పాటు ఇండ్లలోకి ఎదురు ప్రవహిస్తున్నది. ఈ విషయంపై సంబంధిత అధికారులు, కొత్తగా ఏర్పడిన పాలకవర్గానికి పలుమార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఆగ్రహించిన కాలనీ మహిళలు మంగళవారం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పేదలకు ఇండ్లు అందజేసి నివా సం కల్పించిందన్నారు. ప్రస్తుతం మురుగు వెళ్లకపోవడం, ఇండ్లముందు, రోడ్లపై ప్రవహించడం వల్ల దుర్గంధం వెదజల్లుతున్నదన్నారు. దోమలు విజృంభిస్తుండడంతో విషజ్వరాలు వస్తున్నాయన్నారు. గట్టిగా అడిగితే బెదిరిస్తునారని .. ఇండ్లపైకి దాడులకు వస్తున్నారని, కేసీఆర్ను వెళ్లి అడగండని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మురుగు కాల్వల నిర్మాణం, శాశ్వత పారిశుధ్య సమస్య పరిష్కారం కోసం రూ. 1.50కోట్లతో పనులు ప్రారంభించారు.పనులకు సంబంధించి టెండర్ కాంట్రాక్ట్ స్థానికులకు కాకుం డా ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తికి వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న అధికార నాయకులు కొందరు పనులు చేపట్టకుండా సంబంధిత కాంట్రాక్టర్ను బెదిరించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అందోల్ డబుల్ బెడ్రూమ్ కాలనీ వద్ద రూ. 1.50కోట్లతో పనులు చేపడుతున్నామని అందోల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. అందుకు సంబంధించి టెండర్లు పూర్తి చేశామని, మెటీరియల్ సిద్ధంగా ఉందన్నారు. కానీ, స్థానికులు కొంతమంది డ్రైనేజీ నిర్మాణం విషయంలో భిన్నం గా స్పందిస్తుండటంతో తాత్కాలికంగా పనులు ఆపేశామన్నారు. అందరితో మాట్లాడి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.