సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 27 : రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 37 కంపనీలు ఈ జాబ్మేళాలలో పాల్గొనగా.. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు 2,877 మంది ఉద్యోగాల కోసం హాజరయ్యారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి జాబ్మేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో జాబ్మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు.
కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యతను సాధించి ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. జాబ్మేళాకు హాజరై ఉద్యోగం పొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.
ఒక్కో కంపెనీ ఒక్కో టేబుల్ వద్ద అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించి ఆయా ఉద్యోగానికి అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇంటర్వ్యూలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, జిల్లా యువజన సర్వీసులు, క్రీడాధికారి జి రాంచందర్రావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జావెద్ అలీ, ఆర్డీవో మెంచు నగేశ్, తదితరులు పాల్గొన్నారు.