పటాన్చెరు, మే 11 : తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానాలో రూ. 50లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోసిస్ హబ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్యవిధానం ఉత్తమైందన్నారు.
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలను అందజేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో వైద్య పరికరాలను, డయాగ్నొస్టిక్ మిషన్లను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారన్నారు. పటాచ్చెరు నియోజకవర్గం అనగానే కార్మికులు అధికంగా ఉంటారన్నారు. కార్మిక వర్గాలకు నాణ్యమైన వైద్యసేవలు ఉచితంగా అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు.
బొల్లారం, పటాన్చెరు, పాశమైలారం, సుల్తాన్పూర్, కాజీపల్లివంటి పారిశ్రామికవాడల్లోని కార్మికులకు కూడా ఈ వైద్య పరీక్షలు ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజ, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, విజయ్కుమార్, షకీల్,శ్రీను, హాషం, దవాఖానా సుపరిడెంట్ వసుంధర, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.