న్యాల్కల్, ఆగస్టు 4 :స్వయంభూవునిగా వెలిసిన న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామ శివారులోని సిద్ధివినాయక స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. శుక్రవారం సంకష్టహార చతుర్ధి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో వేదపండితులు స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, గణేశ హోమం, హారతి తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఈ సంకష్టహార చతుర్థి వేడుకల సందర్భంగా జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గణేశ హోమం, సిద్ధి, బుద్ధి సామేత వినాయకుని కల్యాణోత్సవం కన్నుల పండువుగా నిర్వహించారు. మండలంలోని హద్నూర్ వరసిద్ధి వినాయక ఆలయం, చీకూర్తి గ్రామంలోని సిద్ధివినాయక ఆలయాల్లో పరిసరా గ్రామాలకు చెందిన భక్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రేజింతల్ సిద్ధి వినాయక ఆలయ కమిటీ అధ్యక్షుడు రేజింతల్ ఆశోక్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింలు, కమిటీ సభ్యలు కోబ్బజీ రవికుమార్, కల్వ చంద్రశేఖర్, ఉల్లిగడ్డ బస్వరాజ్, నీల రాజేశ్వర్, చంద్రయ్య, మేనేజర్ కృష్ణ, ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు, తదితరులు పాల్గొన్నారు.