మునిపల్లి: మండల పరిధిలోని బుదేరా పోలీస్ స్టేషన్లో సంగారెడ్డి (Sangareddy) డీఎస్పీ బాలాజీ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు అన్ని పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ కేసులను త్వరగా విచారణ చేసి కోర్టుకు పంపాలన్నారు.
బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ముఖ్యంగా గంజాయి, పేకాట, గుట్కాపై ప్రత్యేక నిఘా పెట్టి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాలు జరగకుండా పొలీస్ అధికారులు రాత్రి పూట పెట్రోలింగ్ చెయ్యాలన్నారు.
సైబర్ నేరాల గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్ఐ మహేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. పీఎస్ సిబ్బంది అందరూ ఎవరి వర్టికల్లను వారు సక్రమంగా నిర్వర్తించి అట్టి వివరాలను ఎప్పటికి అప్పుడు సీసీటీఎన్ఎస్ (CCTNS) ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలని చెప్పారు.
అలాగే పరేడ్లో చక్కని ప్రదర్శన కనబరచిన పీఎస్ కానిస్టేబుల్ పి. గణపతి రావు, పీసీ-25ను నగదు బహుమతితో అభినందించారు. అదే సమయంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో తగుజాగ్రతలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, మునిపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.