రామచంద్రాపురం, నవంబర్ 12: లోకకల్యాణం కోసం బ్రాహ్మణులంతా ఏకమై రుద్రసహిత శతచండీ మహాయాగాన్ని నిర్వహించడం సంతోషంగా ఉన్నదని శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ కాకతీయనగర్ కాలనీలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయంలో మండల బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రుద్రసహిత శతచండీ మహాయాగానికి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి హాజరయ్యారు. స్వామి వారికి వేదపండితులు, బ్రాహ్మణ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. యాగం జరుగుతున్న తీరుని, పద్ధతిని స్వామివారు అడిగి తెలుసుకున్నారు. ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా శతచండీ యాగం నిర్వహిస్తున్నారని స్వామివారు సంతోషం వ్యక్తం చేశారు. మన చుట్టూ ఉన్న ప్రజలతో పాటు రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రాహ్మణులంతా ఏకమై శాస్త్రం చెప్పినట్టుగా శతచండీ యాగాన్ని నిర్వహించడం శుభసూచికమన్నారు. బ్రాహ్మణుడు ఒక్కరి గురించి కాకుండా లోకమంతా కల్యాణం కావాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని చండీయాగం చేయడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. యాగంతో ఈ ప్రాంతమంతా సంపూర్ణమైన అభివృద్ధి చెందుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విరివిగా రాష్ట్రమంతటా జరపాల్సిన అవసరం ఉన్నదని స్వామివారు వివరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన స్వామివారి ఆశ్రమాన్ని ఆయన ప్రారంభించి భక్తులకు అనుగ్రహం ఇచ్చారు.
రెండో రోజు నిర్వహించిన పూజలు
యాగంలో భాగంగా రెండవరోజు శాంతిపఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 60 పారాయణాలను వేదపండితులు పూర్తి చేశారు. గ్రహణ దోశాలు తొలిగిపోవడానికి నక్షత్ర,
నవగ్రహ, అరుణ, ఆవాహిత, రుద్ర హోమాలను నిర్వహించారు. గురు, దేవతా ప్రార్థన, స్థాపిత దేవతా పూజలు, చండీ సప్తశతీ పారాయణాలు, మహాలింగార్చన, మహాన్యాసపూర్వత శత రుద్రాభిషేకం, మహా మంగళ హారతి, మంత్ర పుష్పం, సాయంత్రం ఆవాహిత దేవతా పూజలు, నవాక్షరి మూలమంత్ర
అనుష్ఠానం, జ్యోతిర్లింగార్చన, కార్తిక దీపోత్సవం, ప్రవచనాలు, హారతి, రాజోపచారపూజ కార్యక్రమాలు
నిర్వహించారు. కర్ణాటక, శృంగేరి, వివిధ దైవ క్షేత్రాల్లో మహాయాగాలను చేసిన వేదపండితులు సుమారు వంద మంది ఈ చండీయాగం నిర్వహిస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన కార్తిక్ శర్మ మండలాలు వేశారు.
అశేష భక్తజనం..
యాగాన్ని తిలకించేందుకు అశేష భక్తజనం తరలి వస్తున్నారు. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. భక్తుల కోసం నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద చండీయాగం స్థానికంగా జరుగుతున్నందుకు భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పారాయణాలు పరిసర ప్రాంతాల్లో వినిపిస్తుండడంతో భక్తులు అమ్మవారిని స్మరించుకుంటున్నారు.రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య సంఘం సభ్యులు, మండల బ్రాహ్మణ సంఘం సభ్యులు, భక్త జనం అశేషంగా హాజరై వైభవోపేతంగా చండీయాగంలో పాల్గొంటున్నారు.