పటాన్చెరు, సెప్టెంబర్ 25: క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 8వ జోనల్ స్థాయి క్రీడాపోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారుల మార్చ్ఫాస్ట్లో ఎమ్మెల్యే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు అగ్రతాంబులం వేస్తున్నామన్నారు. విద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి కనబర్చేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. గురుకులాలు ప్రతిభకు కేంద్రాలుగా ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వ కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి పాఠశాలలో సన్నబియ్యంతో చేసిన అన్నం పెట్టిస్తున్నారన్నారు. ప్రతి వారం గుడ్లు, మాంసం వంటి పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. క్రీడాకారులు చక్కటి ప్రతిభను కనబర్చి పోటీలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు. ఇందుకోసం అన్ని రకాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఎంపీటీసీ శ్రీశైలం, గురుకుల సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.