సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 25: సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా కార్పొరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ యాజమాన్యాల తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు ఉన్నప్పటికీ వాటి యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన అనంతరం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఎంపీ బీబీ పాటిల్, తెలంగాణ హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్తో కలిసి ఆయా శాఖల అధికారులతో పలు అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమ చట్టం మేరకు సీఎస్ఆర్ కింద వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఏ ఒక్కరూ జమ చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నియంత్రణ పద్ధతిలో సీఎస్ఆర్ నిధులు రాబట్టాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, పరిశ్రమల శాఖ జీఏం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తదితర అనుబంధ శాఖల అధికారులతో బృందం ఏర్పాటు చేసి పరిశ్రమల లెక్కలు తనిఖీ చేయాలని ఆదేశించారు. కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు సూచించారు.
పటిష్టంగా దళితబంధు అమలు చేయాలి
జిల్లాలో దళితబంధును పటిష్టంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. దళితబంధులో వంద శాతం గ్రౌం డింగ్ పూర్తి కావాలని స్పష్టంచేశారు. 444 మంది లబ్ధిదారులకు ఇచ్చిన యూనిట్లను అధికారులు క్షేత్ర స్థాయి లో పరిశీలించాలన్నారు. వ్యక్తి, గ్రామం, నియోజకవర్గ వారీగా దళిత బంధుతో లాభ పడ్డారా? లేదా అనే విషయాలపై వారి జీవన స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వారు ఎంచుకున్న యూనిట్ విజయవంతం అయ్యేలా పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. త్వరలో లబ్ధిదారులను కలిసి మాట్లాడనున్నట్టు మంత్రి తెలిపారు.
రూ.374 కోట్ల పనులకు టెండర్లు పూర్తి చేయాలి
జిల్లాకు సీఏం కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీఎఫ్) కింద మంజూరు చేసిన రూ.374 కోట్లతో పనులకు టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి సూచించారు. నిమ్జ్ ప్రాజెక్ట్ వెమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నైపుణ్యత అభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని దసరా తరువాత జహీరాబాద్లోని సమీకృత వసతి గృహంలో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. భూములు కోల్పోయిన కుటుంబాలను గుర్తించి ఆసక్తిగల నిరుద్యోగులకు నైపుణ్యతా అభివృద్ధి శిక్షణకు దరఖాస్తులు స్వీకరించి, శిక్షణ ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని 5 పీహెచ్సీలకు రూ.7.80 కోట్లు, 6 బస్తీ దవాఖానలకు రూ.78 లక్షలు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. జహీరాబాద్ ఆటోనగర్కు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి తగిన మంజూరు తీసుకోవాలని టీఎస్ఐఐసీ అధికారులకు ఆదేశించారు.
మన ఊరూ- మనబడి పనులు పూర్తి చేయాలి
జిల్లాలో చేపట్టిన మన ఊరూ- మనబడి పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని పట్టణాలు, గ్రామాలు, తండాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగాలన్నారు. మన ఊరు -మనబడి పనుల పురోగతిని రెగ్యులర్గా సమీక్షించి, త్వరిగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని, పూర్తయిన పనులకు ఎంబీ చేసి చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ దవాఖానలను ఎప్పటికపుడు తనిఖీ చేయాలని కలెక్టర్కు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.