సంగారెడ్డి సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సం బురాలు అంబరాన్నంటాయి. తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించి 75ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో శుక్రవారం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. సంగారెడ్డితో పాటు పటాన్చెరు, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రాల్లో వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాలను విద్యార్థులు, యువకులు, మహిళలు చేతబూని ర్యాలీలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ కదం తొక్కారు. వంద బుల్లెట్ వాహనాలతో పట్టణంలో యువకులు నిర్వహించిన బైక్ ర్యాలీ ఆకర్శణగా నిలిచింది. సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్రావు, ఆర్డీవో మెంచు నగేశ్, డీఎస్పీ రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్చైర్మన్ లతా విజయేందర్రెడ్డి పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో మంజుశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్యంలోకి సెప్టెం బర్ 17, 1948లో అడుగుపెట్టిందని గుర్తు చేశారు. స్వాతం త్య్రం సిద్ధించి 75సంతవ్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యం లో ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ట్లు వివరించారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి తెలంగాణ ప్రవేశించి 75ఏండ్లు పూరైందని తెలిపారు. సభకు హాజరైన అందరికి జిల్లా యంత్రాంగం భోజన సదుపాయాలు ఏర్పా టు చేసింది. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. అందోలులో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్యక్షతన అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాహుల్ కిరణ్, భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య పాల్గొన్నారు.
మెదక్లో వైభవంగా వజ్రోత్సవాల ర్యాలీ
డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పీర్ల ఊరేంగింపులు, బతుకమ్మ, బోనాల సంబురాలతో మెదక్ జిల్లా కేంద్రం దద్దరిల్లింది. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ కొనసాగింది. అంతకుముందు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్లతో కలిసి జెండా ఊపీ ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ జాతీయజెండాను చేతపట్టుకుని ర్యాలీ లో పాల్గొన్నారు. యువకుల నృత్యాలు, మహిళల కోలా టం, విద్యార్థుల నినాదాలతో పట్టణం మారుమోగింది. జూ నియర్ కళాశాల మైదానంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నా యి. విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆడిపాడారు. వజ్రోత్సవాల్లో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జిల్లా ఎస్పీ రోహిని ప్రియదర్శిని, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రమేశ్కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జడ్పీ సీఈవో శైలేశ్, జిల్లా మత్స్యశాఖాధికారి రజిని, ఆర్డీవో సాయిరాం, అధికారులు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళాలు పాల్గొన్నారు.