సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 8: శ్యామ్ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ కింద చేపట్టిన పనుల పరిశీలన కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి బృందం గురువారం జిల్లాలో పర్యటించింది. అంతకుముందు కలెక్టరేట్కు చేరుకున్న కేంద్ర బృందానికి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషాతో కలిసి కలెక్టర్ డాక్టర్ శరత్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, అనుబంధ శాఖల అధికారులతో బృందం భేటీ అయ్యింది. అనంతరం జిల్లా భౌగోళిక పరిస్థితులను కేంద్ర బృందానికి కలెక్టర్ వివరించారు. ర్యాకల్ క్లస్టర్లోని శ్యామ్ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ కింద చేపట్టిన పనులు, పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంయుక్త కారదర్శి స్మృతి శరణ్, ఉప కార్యదర్శి నివేదిత ప్రసాద్, రూర్బన్ కన్సల్టెంట్ బిహు మహాపాత్ర, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నారాయణఖేడ్లో..
నారాయణఖేడ్ మండలంలో చేపట్టిన ర్యాకల్ క్లస్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పనులు భేష్ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి అధికార బృందం కితాబిచ్చింది. గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి అధికార బృందం నారాయణఖేడ్ మండలంలో పర్యటించింది. నారాయణఖేడ్తో పాటు నిజాంపేట్, ర్యాకల్, గంగాపూర్, హన్మంతరావుపేట్, జూకల్ గ్రామాల్లో పర్యటించి ఆక్సిజన్ పార్కు, ఆడిటోరియం, పశువైద్యశాల, సైన్స్ల్యాబ్లు, పందిరి సాగు తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, డీఆర్డీవో శ్రీనివాస్రావు ఉన్నారు.