సంగారెడ్డి/మెదక్ న్యూస్నెట్ వర్క్, సెప్టెంబర్ 1: వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి, మెదక్ పట్టణాలతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బుధవారం భక్తిశ్రద్ధలతో గణనాథులకు పూజలు నిర్వహించారు. మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు భక్తులకు వైభవంగా తొలి పూజ చేశారు. గృహాల్లో గణేశ్ ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేశారు. వాడావాడలో గణేశ్ మండపాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి భారీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. వేద పండితుల సమక్షంలో గణనాథులకు పూజలు చేసి పలు రకాల నైవేద్యాలను సమర్పించారు. సంగారెడ్డి జిల్లాలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మకమలాలతో విఘ్నేశ్వరుడుకి పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొన్ని చోట్ల 9రోజులు, మరికొన్ని చోట్ల 11రోజుల పాటు గణేశ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. సంగారెడ్డి పట్టణ శివారులోని గోదా సమేత విరాట్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. సంగారెడ్డి కలెక్టర్ శరత్ దంపతులు తొలి పూజ లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పటాన్చెరు మండలంలోని రుద్రారం గణేశ్ దేవస్థానాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.