సంగారెడ్డి, ఆగస్టు 22: ఆపదలో ఉన్న మహిళల సహాయార్థం, వారికి వెన్నుదన్నుగా నిలిచి సేవలందించేందుకు భరోసా కేంద్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని శ్రీనగర్ కాలనీలో అరబిందో ఫార్మా లిమిటెడ్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ యాజమాన్యం సహకారంతో రూ.2 కోట్లతో నిర్మించనున్న భరోసా కేంద్రం భవనానికి మంత్రి ఎంపీ కొత్త ప్రభాకర్తో కలిసి భూమిపూజ చేశారు. అంతకుముందు మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమెన్ సేఫ్టీవింగ్ పర్యవేక్షణకు మెరుగైన సేవలు అందించేందుకు భరోసా కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. 5,600 చదరపు అడుగుల స్థలంలో రూ.2 కోట్లతో విశాలవంతమైన భవనం నిర్మాణం చేసుకోవడం సంతోషకరమన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రం నిర్మాణానికి నిధులు ఖర్చు చేసి, మహిళలకు అండగా అరబిందో యాజమాన్యం నిలవడం హర్షనీయమన్నారు. ‘జెండర్ ఈక్విటీ-మహిళా సాధికారత’ అనే పథకంతో సీఎస్ఆర్ చొరవతో మహిళలు, పిల్లల భద్రతను ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్టు చేపట్టి సమాజానికి సేవలు అందించడం గొప్పవిషయమన్నారు.
పోక్సో చట్టంతో మహిళలకు భరోసా…
సమాజంలో ఆకతాయిల ఆకృత్యాలకు బలవుతున్న ఎందరో మహిళలకు పోక్సో చట్టంతో భరోసా కలుగుతుందని, ముఖ్యంగా అత్యాచారానికి గురైన మహిళలు, చిన్నారులకు షీ టీమ్స్ భరోసాగా నిలుస్తున్నాయని ఎస్పీ రమణకుమార్, కలెక్టర్ శరత్ అన్నారు. మహిళలకు ఆపద ఎదురైనప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే 24/7 మహిళా పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రస్తుతం పోక్సో, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్కు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం చేసేందుకు భరోసా కేంద్రాలకు బదిలీ చేయడం వలన మెడికల్ ఎగ్జామినేషన్, బాధితురాలి వాంగ్మూలం నమోదు, బాధితురాలికి మానసిక దృఢత్వానికి కౌన్సిలింగ్ ఇప్పించడం, 164 సీఆర్పీసీ స్టేట్మెంట్ను వీడియో కాన్ఫరెన్స్తో నమోదు చేసి బాధితురాలికి వసతి కల్పించడం వంటివి చేయవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలకు అవగాహన కల్పించేందుకు భరోసా కేంద్రం సహాయం తీసుకుని యుక్త వయస్సులో ఉన్న బాలికలు, అబ్బాయిలతో పాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ, కౌన్సిలర్లు విష్ణువర్ధన్, నిర్మలారెడ్డి, జడ్పీటీసీ సునీతా, అరబిందో యాజమాన్య ప్రతినిధులు శరత్ చంద్రారెడ్డి, నిత్యానందరెడ్డి, ఉమెన్ పీఎస్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి, ఎస్సై రాణి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.